భర్త వద్దకు తీసుకెళ్తానని చిత్రహింసలు 

8 Apr, 2021 03:04 IST|Sakshi

మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కు.. 

సిగరెట్లతో చేతులపై కాల్చి నరకం చూపిన కామాంధుడు 

వ్యభిచారం చేయాలంటూ ఆదివాసీ మహిళపై ఒత్తిడి 

గార్ల: మాయమాటలు చెప్పి ఓ వివాహితను హైదరాబాద్‌ తీసుకెళ్లిన వ్యక్తి.. ఆమెను గదిలో నిర్బంధించి, అత్యాచారం చేయడమే కాకుండా వ్యభిచారం చేయాలని చిత్రహింసలకు గురిచేశాడు.  మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ బాధిత మహిళను  రెండేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఎనిమిది నెలల క్రితం సదరు మహిళ తల్లిగారి గ్రామమైన భద్రాచలం సమీపంలోని ఎటపాకకు వెళ్లి ఉంటోంది.

ఈ క్రమంలో అంకన్నగూడెంకు చెందిన భూక్యా సర్వేశ్‌ నెల కింద ఏటపాక వెళ్లి తన భర్త హైదరాబాద్‌లో ఉంటున్నాడని, అతని దగ్గరకు తీసుకెళ్తానని   చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె సర్వేశ్‌తో రాగా.. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని అద్దె గదిలో బాధితురాలిని, ఆమె కూతురును ఉంచాడు. భర్త విషయం ఎప్పుడు అడిగినా దాటవేయడంపై ఆమె సర్వేశ్‌ను నిలదీయడంతో చిత్రహింసలకు పాల్పడ్డాడు.

ఒంటిపై సిగరెట్లతో కాల్చడమే కాకుండా, వ్యభిచారం చేయాలని కొట్టేవాడు. ఆమెతో పాటు కుమార్తె చేతులపై కూడా సిగరెట్లతో కాల్చేవాడు. సర్వేశ్‌ తన స్నేహితులను గదికి తీసుకొచ్చి ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను లాక్కొని అమ్ముకున్నాడు. ఓ రోజు ఆ ఇంటి యజమాని సాయంతో ఆమె బయటపడి.. అంకన్నగూడెం చేరుకొంది. భర్త, అత్తకు విషయం చెప్పగా.. వారు గార్ల పోలీస్‌స్టేషన్‌లో సర్వేశ్‌పై ఫిర్యాదు చేశారు.

చదవండి: కార్పెట్‌ నచ్చింది.. రూ. 3 వేలు పంపుతున్నా అంటూ

మరిన్ని వార్తలు