వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

9 Apr, 2022 23:29 IST|Sakshi

ములకలచెరువు: అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రం మండలం పులికల్లుకు చెందిన తలారి శివక్రిష్ణకు అనంతపురం జిల్లా కుటాగులకు చెందిన కె.గంగరాజు కుమార్తె గాయత్రి(26)తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. కొన్ని నెలలుగా అత్త నారాయణమ్మ, మామ వేణుగోపాల్, భర్త శివక్రిష్ణ వేధింపులకు గురి చేస్తున్నారు.

పొలం వద్దకు వెళ్లి రాత్రి పూట కాపలా ఉండాలని, ఇంట్లో ప్రతి పనికి దూషిస్తుంటారని కుమార్తె తమకు చెప్పుకొని కుంగిపోయేదని గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శివక్రిష్ణ తాగుడుకు బానిస అయ్యాడని, తరచూ ఇంట్లో గొడవలు జరిగేవని చెప్పారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైంది. భర్త గమనించి వాహనంలో ములకలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.

పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనతో బెంగళూరుకు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గురువారం రాత్రి పొలం వద్దకు తీసుకొచ్చారు. గంగరాజు ఫిర్యాదుతో వేధింపులు, గృహ హింస చట్టం కింద అత్త, మామ, భర్తపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.రామక్రిష్ణ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కడుపునొప్పితో..
ఓబులవారిపల్లె : కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లంపేట మండలం బోటీమీదపల్లెలోని ఎన్టీ కాలనీకి చెందిన కానూరు రమాదేవి(25)కి అదే గ్రామానికి చెందిన శ్యామా అనే వ్యక్తితో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇటీవల సాయికుమార్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరూ మండలంలోని ముక్కావారిపల్లె ముక్కా విరుపాక్షరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కాపలా దారులుగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం కడుపు నొప్పి తాళలేక గడ్డి మందు తాగింది. వెంటనే కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు