అమ్మ ఇక లేదు.. ప్రేమ పెళ్లి విషాదాంతం

26 Nov, 2022 07:59 IST|Sakshi

ఆ పిల్లలకు అమ్మ చేతి ముద్ద ఇక అందదు. ఆ బిడ్డలకు అమ్మ ముద్దు మరి లేదు. కన్నతల్లుల క్షణికావేశం వారి పేగు తెంచుకుని పుట్టిన పిల్లలకు జీవితకాల శాపమైంది. కష్టాలకు తాళలేక, సమస్యలను ఎదుర్కోలేక, వేధింపులు భరించలేక ఇద్దరు అమ్మలు తమ జీవితాలను అర్ధంతరంగా ముగించారు. కానీ పిల్లలను అనాథలను చేశారు. తల్లిదండ్రుల మధ్య గొడవలకు చిన్నారులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.   

సాక్షి, శ్రీకాకుళం: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు నెలలుగా వచ్చిన విభేదాలు ఆమె ప్రాణాన్ని బలికొన్నాయి. మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన చిత్తిరి గౌతమి (25) ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 

గౌతమికి చిత్తిరి సత్యనారాయణతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడే ళ్ల కుమార్తె తేజశ్విని, ఐదేళ్ల కుమారుడు షణ్ముఖనాయుడు ఉన్నారు. అయితే ఈ దంపతుల మధ్య రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నా యి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటిలో  ఎవ రూ లేని సమయం చూసి గౌతమి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత అత్త, బావ, తోడి కోడళ్లు ఉరికి వేలాడుతున్న గౌతమిని చూసి వెంటనే పొలం పనికి వెళ్లిన సత్యనారాయణకు స మాచారం అందజేశారు.

గౌతమి అమ్మానాన్నలకు కూడా విషయం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు రమణ, అప్పలసూరమ్మ ఇంటికి చేరుకొని భోరున విలపించారు. భర్త వేధింపులు భరించలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెతో తరచూ గొడవలకు దిగేవాడని, అనవసరంగా హింసించేవాడని తెలిపారు. గౌతమి ఆత్మహత్యపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ సామంతుల రామారావు తన సిబ్బంది, శ్రీకాకుళం క్లూస్‌ టీమ్‌తో గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త స త్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రా మారావు కేసు నమోదు చేశారు. జేఆర్‌పురం సీఐ స్వామినాయుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు.  

అమ్మా.. లే అంటూ.. 
తల్లి గౌతమి మృతిచెందడం, తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమ్మా..లే అంటూ చిన్నారులు పిలవడం అక్కడున్న వారి చేత కంటతడి పెట్టించింది.   

పెట్రోల్‌ పోసుకుని.. 
టెక్కలి రూరల్, వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం పూండిలో శుక్రవారం ఓ వివాహిత తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం సూర్యమణిపురం గ్రామానికి చెందిన పైల దేవిక(29) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన కామేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెకు ఇది మూడో వివాహం. ఈ దంపతులకు ఏడాది వయసు గల పాప ఉంది. దేవికకు మరో అమ్మా యి కూడా ఉంది. కామేశ్వరరావు మర్చెంట్‌ నేవీలో పనిచేస్తున్నారు. ఆమె భర్తతో కలిసి పూండీలో నివాసం ఉంటున్నారు.


దేవిక (ఫైల్‌) 

అయితే తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆమె నిత్యం అనుమానిస్తూ ఉండేవారు. దీనిపైనే ఆ మహిళతో గొడవలు కూడా పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెతో గొడవకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు మంటలను ఆపి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మెరుగైన వైద్యం కోసం ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ఈ ఘటనపై జూనియర్‌ సివిల్‌ జడ్జి తేజా చక్రవర్తి మల్ల బాధితురాలి నుంచి వాగ్మూలం తీసుకున్నారు. వజ్రపుకొత్తూరు పోలీసులు వివరాలు సేకరించారు. అయితే ఆమె శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతి చెందారు.    

మరిన్ని వార్తలు