ఫ్యామిలీతో గొడవ.. తుపాకీతో తూటాల వర్షం కురిపించి విధ్వంసం.. 11 మంది మృతి..

13 Aug, 2022 01:19 IST|Sakshi

ఆగ్నేయ ఐరోపా దేశం మెంటెనెగ్రోలో మాస్ షూటింగ్ ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఓ సాయుధుడు తుపాకీతో విధ్వంసం సృష్టించాడు. తన చుట్టుపక్కల ఉన్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు.

అయితే సెటింజేకు చెందిన వ్యక్తి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఇరుగుపొరుగువారిపై తుపాకీతో తూటాల వర్షం కురిపించాడని స్థానిక మీడియా తెలిపింది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్పిచంపారు. మాంటెనెగ్రో అంతర్గత వ్యవహారాల శాఖ కూడా ఈఘటనపై స్పందించలేదు.

పర్యాటకంగా మంచి గుర్తింపు పొందిన ఈ దేశంలో ఇలాంటి భయానక ఘటన జరగడం దశాబ్దాల్లోనే ఇదే తొలిసారి. చుట్టూ పర్వతాలుండే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచదేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడి పర్యటక రంగానికి ఇదే మంచి సీజన్. ఎక్కువ మంది సందర్శకులు వచ్చే సమయంలో మాస్ షూటింగ్‌ జరగడం అధికారులను ఆందోళనకు గురిచేసింది.
చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్‌ రష్డీపై దాడి

మరిన్ని వార్తలు