కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి

1 Jul, 2022 04:07 IST|Sakshi
కిడ్నాపర్ల చెరలో శంకరయ్య

రూ.15 లక్షలు డిమాండ్‌ చేస్తూ.. బాధితుడి ఫొటో విడుదల  

పెగడపల్లి(ధర్మపురి): జగిత్యాల జిల్లాలో కిడ్నాప్‌కు గురైన మత్తమల్ల శంకరయ్య (50)ను తాళ్లతో కట్టేసి బంధించిన ఫొటోను కిడ్నాపర్లు గురువారం అతడి కుమారుడు హరీశ్‌కు పంపించారు. దీంతో శంకరయ్య కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్నట్లు తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 22న దుబాయి నుంచి ముంబైకి వచ్చారు.

ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కే క్రమంలో అతను కిడ్నాప్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. కిడ్నాపర్లు శంకరయ్య ఫొటోను ఇంటర్‌నెట్‌ ద్వారా అతడి కుమారుడు హరీశ్‌ వాట్సాప్‌కు గురువారం పంపించారు. ఇంటర్‌ నెట్‌ ద్వారా ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు తమిళ, మళయాల భాషల్లో మాట్లా డారు. రూ.15 లక్షలు ఇస్తేనే శంకర య్యను వదిలిపెడతామని తేల్చి చెప్పారు.

మధ్య తరగతి కుటుంబా నికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అతని భార్య అంజవ్వ, కుమారుడు హరీశ్, కూతురు గౌతమి వారం రోజులుగా క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చొరవ చూపి శంకరయ్య క్షేమంగా ఇంటికి చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు