మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ అరెస్ట్‌

9 Sep, 2020 19:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లంచం తీసుకున్న కేసులో మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నగేష్‌తో పాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, సర్వేల్యాండ్‌ రికార్డ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం మహ్మద్‌, నగేష్‌ బినామీ జీవన్‌ గౌడ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిందరికీ వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం​ హైదరాబాద్‌ తరలిస్తున్నారు. భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేస్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్)

కాగా కోట్ల రూపాయిలు లంచాలు తీసుకుంటున్న నగేష్‌కు ఏసీబీ అధికారులను చూడగానే ముచ్చెమటలు పట్టాయి. ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తనకు 103 డిగ్రీల జ్వరం ఉందని, ఛాతీలో నొప్పి, ఆయాసంగా ఉందంటూ చెప్పడంతో... వైద్యుల పర్యవేక్షణలో నగేష్‌కు ఫీవర్‌ చెక్‌ చేయడంతో పాటు మందులు అందిస్తూనే మరోవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రిలో చేర్పించాలంటూ అడిషనల్‌ కలెక్టర్‌ ఈ సందర్భంగా అధికారులను కోరారు. (రూ.1.12 కోట్లకు డీల్‌: ఆడియో సంభాషణ)

ఎకరానికి లక్ష చొప్పున ఒప్పందం

ఈ కేసుపై ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ‘శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఫిర్యాదుతో సోదాలు చేశాం. మాకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. 29 ఫిబ్రవరి 2020 న, ఆయనతో పాటు మరో నలుగురు 112 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేయడానికి అమ్మకం ఒప్పందానికి ఎన్‌వోసీ ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితాలో భూమి ఉన్నందున ఎన్‌వోసీ కోసం బాధితుడు వెళ్ళాడు. జులై 31న మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేష్‌కు రూ.1 కోట్ల 12 లక్షలు మేరకు డీల్‌ కుదిరింది. ఎకరానికి లక్ష రూపాయిల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట విడతగా ఫిర్యాదుదారుడి నుండి19.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ తీసుకున్నారు.

ఆగస్ట్‌​ 7 తేదీన ఫిర్యాదుదారుడి నుండి మరోసారి 20.5 లక్షలు లంచం తీసుకున్నారు. మిగిలిన రూ.72 లక్షలకుగాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ కోలా జీవన్ గౌడ్కి బాధితుడు బదిలీ చేసినట్టు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం గడ్డం నగేష్ ఫిర్యాదుదారుడి నుండి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నాడు. జూలై 31న జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు తీసుకున్నాడు. లక్ష రూపాయిలు ఆర్డీవోకి, మరో లక్ష తహసీల్దార్‌కు వసీం ఇచ్చాడు. ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటు పలు భూ డాక్యుమెంట్లు కూడా గుర్తించాం. నగేష్ ఇంట్లో అగ్రిమెంట్ సెల్ డీడ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం’ చేసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు