అడిషనల్‌ దందా’పై నగేశ్‌ మౌనం

22 Sep, 2020 03:08 IST|Sakshi

తొలిరోజు ఏసీబీ విచారణకు సహకరించని మాజీ ఏసీ

పార్టీలు, ప్రలోభాలతో అధికారులకు చేరువైన జీవన్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌ : మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ ‘అడిషనల్‌’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం లేదని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఈ కేసులో ఇటీవల ఏసీబీ కోర్టు ఐదుగురు నిందితులైన మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్, జూనియర్‌ అసిస్టెంట్‌ మహమ్మద్‌ వాసీం, మాజీ ఆర్డీవో అరుణారెడ్డి, మాజీ తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్, నగేశ్‌ బినామీ కోలా జీవన్‌గౌడ్‌లను నాలుగురోజుల కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగా సోమ వారం ఉదయం నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నగేశ్‌ ఆస్తులు, అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించినట్లు సమా చారం. గతంలో ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడిపారా? అన్న విషయాలపై నగేశ్‌ నోరు మెదపలేదని సమాచారం. నగేశ్‌ తమతో పలు అక్రమ వ్యవహాలు చేసేలా ఒత్తిడి పెంచాడని ఇటీవల పలువురు తహసీల్దార్లు చేసిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నగేశ్‌ ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. వీరి కస్టడీ గడువు ఈ నెల 24తో ముగియనుంది.

పార్టీలు, ప్రలోభాలతో బుట్టలోకి!
ఈ క్రమంలో జీవన్‌గౌడ్‌కు సంబంధించి ఏసీబీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టినట్లు సమాచారం. నగేశ్‌పై దాడుల సమయంలో ఏసీబీ అధికారుల బృందం ఒకటి.. జీవన్‌గౌడ్‌ కోసం ప్రత్యేకంగా అతని స్వస్థలమైన నిర్మల్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానికంగా పైరవీకారుడిగా పేరున్న జీవన్‌గౌడ్‌ గతంలోనూ పలువురు అధికారులను ఇలాంటి అక్రమాలకు వినియోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం డబ్బుతోపాటు పలు రకాల విలాసాలు, పార్టీలు ఆశజూపి ప్రలోభాలకు గురిచేసే వాడని పలువురు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సినిమా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలతో తనకు పరిచయాలున్నాయని జీవన్‌గౌడ్‌ అధికారులను మభ్యపెట్టి పనులు చేయించుకునేవాడని పలువురు రెవెన్యూ సిబ్బంది ఏసీబీకి తెలిపినట్లు సమాచారం. నగేశ్‌కు జీవన్‌గౌడ్‌ తక్కువ కాలంలోనే దగ్గరయ్యాడని, నమ్మకస్తుడిగా మారి బినామీగా ఎదిగాడని తెలిసింది. ఏకంగా జీవన్‌గౌడ్‌ పేరిట పది ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయాలని బా«ధితుడు లింగమూర్తిపై ఒత్తిడి చేశాడంటే.. అతను నగేశ్‌కు ఎంతటి ఆప్తుడిగా మారాడో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు