కూలీ పనుల కోసం వెళ్లారు.. అంతలో

19 Apr, 2021 12:15 IST|Sakshi

చేగుంట (తూప్రాన్‌): రోడ్డు పక్కన నిలిపిన ఆటోను ఓ లారీ వెనక వైపు నుంచి ఢీకొట్టిన ఘటనలో అందులో కూర్చున్న 11 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మెదక్‌ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్‌పేట వద్ద ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చేగుంట మండలం మక్కరాజ్‌పేట గ్రామానికి చెందిన మహిళలు మసాయిపేటలోని సీడ్‌ కంపెనీలో కూలీ పనులకు వెళ్లేందుకు ఆదివారం ఉదయం రోడ్డు పక్కన ఉన్న ఆటోలో కూర్చోగా అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఈ సంఘటనలో మైలారం సుశీల, పుట్ట పద్మ, కొరివిపల్లి నర్సమ్మ, శ్యామల, ఆటో డ్రైవర్‌ పంబల్ల భిక్షపతి, ఎర్రగొల్ల నాగమని, కొరివిపల్లి రేణుక, మైలారం సంతోష, సుశీల, చింతకింది దుర్గమ్మ, లక్ష్మి గాయపడ్డారు. క్షతగ్రాతులను గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో విషమంగా ఉన్న సుశీల, భిక్షపతి, లక్ష్మిలను హైదరాబాద్‌ తరలించి వైద్యం అందిస్తున్నారు. గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు. బాధితుల ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

( చదవండి: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం )

మరిన్ని వార్తలు