సాక్షి, హైదరాబాద్ : కాలేజీ విద్యార్థులకు, మత్తుకు బానిసలైన వారికి అక్రమంగా మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న మెడికల్ షాపు నిర్వాహకుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివవరాలు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పుల ఇంజక్షన్లు, నిద్ర మాత్రలు అమ్ముతున్నారనే సమాచారంతో మల్కాజిగిరిలోని ఓ మెడికల్ షాపుపై మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసులు దాడి చేశారు. మెడికల్ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో మత్తుకు బానిసైన వారు దుకాణానికి వస్తారని తెలిసింది.
మత్తు కోసం నొప్పులకు ఉపయోగించే ఇంజక్షన్లు, నిద్ర గోళీలను ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రెగ్యులర్గా కాలేజీ విద్యార్థులకు, మత్తుకు బానిసలైన వారికి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లకు వీటిని అమ్ముతున్నట్లు తెలిసింది. దుకాణంలో అధిక మొత్తంలో ఉన్న ఇటువంటి మందులను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం దుదుకాణ నిర్వాహుడిని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.