Bengaluru: చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం, హత్య?

3 Nov, 2022 08:35 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు(యశవంతపుర): చిన్నారులు, మహిళలపై కామాంధులు దాడులకు తెగబడుతున్నారు. చట్టం, పోలీసులు అనే భయం లేకుండా దౌర్జన్యాలకు పాల్పడడం వల్ల వారికి రక్షణ లేకుండా పోతోంది. ఇదే కోవలో మరుగుదొడ్డికి వెళ్లిన బాలికపై అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన ఘోర సంఘటన కలబురిగి జిల్లా ఆళంద పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. మంగళవారం ఈ దారుణం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.  

కాలకృత్యాల కోసం వెళ్లగా  
వివరాలు...అఫ్జలపుర తాలూకాకు చెందిన బాలిక (15) 9వ తరగతి చదివేది. చదువుకోవడానికి ఆళంద తాలూకాలోని కోరళ్లి గ్రామంలో మేనత్త ఇంట్లో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాలకృత్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. గ్రామానికి సమీపంలో చెరుకు తోటలో బాలిక శవమై కనిపించింది. బాలిక శరీరంపై గాయాలున్నాయి. ఆత్యాచారం చేసిన దుండగులు వస్త్రంతో గొంతుకు బిగించి హత్య చేశారు.  

మూకుమ్మడి అత్యాచారం?  
బాలికను బలవంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. దీంతో మూకుమ్మడి అత్యాచారంగా అనుమానిస్తున్నారు. దీపావళి పండుగకు ఊరికి వెళ్లిన బాలిక మంగళవారం మేనత్త ఇంటికి తిరిగి వచ్చింది. ఇంతలోనే ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఘటనాస్థలాన్ని కలబురిగి ఎస్పీ ఇశా పంత్‌ పరిశీలించారు. ఆళంద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక హత్యను నిరసిస్తూ ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేసి వెంటనే హంతకులను అరెస్ట్‌ చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. 

మరిన్ని వార్తలు