దళిత బాలిక దుస్తులపై వీర్యం ఆనవాళ్లు లేవు

11 Nov, 2021 08:37 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు అదనపు సెషన్స్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నలుగురు నిందితుల దుస్తులపై, బాధితురాలి దుస్తులపై వీర్యం ఆనవాళ్లేవీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ టెస్టులో బయటపడలేదని పేర్కొన్నారు. అలాగే నిందితుల దుస్తులపై, ఘటనా స్థలంలో వారి గదిలో లభించిన బెడ్‌షీట్‌పై బాలిక రక్తం మరకలు లేవని తేలినట్లు వెల్లడించారు.

ఈ మేరకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ట్యాబ్‌ టెస్టు నివేదికను చార్జీషీట్‌తో జతచేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్మశానంలో నీళ్ల కోసం వెళ్లిన బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి, హతమార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ కేసులో శ్మశానంలోని గుడి పుజారి రాధేశ్యామ్‌(55), శ్మశానం సిబ్బంది కుల్దీప్‌సింగ్, సలీం అహ్మద్, లక్ష్మీనారాయణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వారిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే బాలిక మృతదేహాన్ని దహనం చేశారని తల్లి ఆరోపించారు.

చదవండి:  పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు

మరిన్ని వార్తలు