పసుపుతాడు వద్దందని.. ఉరితాడు బిగించారా?

17 Jun, 2021 08:21 IST|Sakshi

బాలిక అనుమానాస్పద మృతి

సాక్షి, చెన్నై : తనకు జరుగుతున్న బాల్య వివాహాన్ని పోలీసు సాయంతో థైర్యంగా ఆపేసిన ఓ బాలిక బుధవారం ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా పాండియూరుకు చెందిన రజనీ, తామరై సెల్వి దంపతుల కుమార్తె(17)కు సమీప గ్రామానికి చెందిన యువకుడితో వివాహ ఏర్పాట్లు జరిగాయి. ప్లస్‌ టూ పూర్తి చేసిన తాను ఉన్నత చదువులు చదువుకోవాలని, తనకు పెళ్లి వద్దంటూ ఆ బాలిక తల్లిదండ్రుల్ని వేడకున్నా వారు ఖాతరు చేయలేదు. గత వారం వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఆ బాలిక తన వివాహాన్ని అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు.

తల్లిదండ్రులను, వరుడి కుటుంబాన్ని హెచ్చరించి వదిలి పెట్టారు. బాలికను అభినందించారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, బుధవారం ఉదయాన్నే ఆ బాలిక శవంగా తేలింది. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో మృతదేహం బయట పడింది. సమాచారం అందుకున్న మదురై అన్నానగర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను హతమార్చి ఉరేసుకున్నట్టు నాటకం రచించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు