దారుణం: మైనర్లకు వివాహం.. మూడు నెలలకే

31 Oct, 2020 08:48 IST|Sakshi
హత్యకు గురైన బాలిక (ఫైల్‌)  

సాక్షి, తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం ఓ మైనర్‌ బాలికకు, మైనర్‌ బాలుడికి వివాహం చేశారు. వివాహమైన మూడు నెలలకే ఆ బాలిక శుక్రవారం హత్యకు గురైంది. సేకరించిన వివరాల ప్రకారంయర్రబాలెం గ్రామం టేకుతోట సమీపంలో నివాసం ఉండే గురవయ్య, విజయలక్ష్మిల పెద్ద కుమార్తెకు, పక్కనే నివాసం ఉండే వీరయ్య, ఈశ్వరమ్మల కుమారుడికి మూడు నెలల క్రితం వివాహం చేశారు. మైనర్లిద్దరూ ప్రేమించుకోవటంతో అబ్బాయి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకుని, రూ.2.40 లక్షల కట్నం అడిగారు.

ఐదు నెలల తర్వాత ఇస్తామని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు. కొంతకాలంగా అత్తామామలు, భర్త కట్నం తీసుకురావాలని బాలికను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున వారు నివాసం ఉండే ఇంటికి 500 మీటర్ల దూరంలో చెట్ల పొదల్లో బాలిక మృతి చెంది కనిపించింది. బహిర్భూమికి వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటనా స్థలానికి వచ్చిన సీఐ శేషగిరిరావు డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించారు. జాగిలాలు భర్త దగ్గరకు వెళ్లి ఆగాయి. పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన సంఘటనపై సీఐ శేషగిరిరావును వివరణ కోరగా జరిగింది హత్యేనని నిర్ధారించారు. బాలిక మొహాన్ని కోసి, విచక్షణా రహితంగా పొత్తి కడుపు కింద భాగంలో కత్తితో పొడిచారన్నారు. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 
(ప్రియుడి మోజులో.. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరుతో)

>
మరిన్ని వార్తలు