లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు 

21 Aug, 2021 08:03 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ విశాల్‌ గున్ని, వెనుక ముసుగులో నిందితుడు 

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌)/రాజుపాలెం: రాజుపాలెం గ్రామంలో బాలిక(16)పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్‌ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు.  ఘటన జరిగిన ఒకట్రెండు గంటల్లోనే అతన్ని పట్టుకున్నామని చెప్పారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం విలేకరులకు కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. గుంటూరు నగరానికి చెందిన దంపతులు కుమార్తె (16)తో కలిసి ఇటీవల రాజుపాలెం ఆర్‌ఆర్‌సెంటర్‌లోని అమ్మమ్మ వాళ్ల ఇంటికెళ్లారు. ఈనెల 18వ తేదీన వీధిలో నడిచి వెళ్తున్న బాలికను దూరపు బంధువు, డ్రైవర్‌ అయిన గల్లా లావాన్‌ ఇంట్లోకి రావాలని పిలిచాడు. ఇంట్లోకెళ్లిన బాలికపై అతను అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒంటిపై గాయాలున్న కుమార్తెను తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ఘటనపై మేనమామతో కలసివచ్చి రాజుపాలెం పీఎస్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

పిడుగురాళ్ళ రూరల్‌ సీఐ వీరాంజనేయులు, ఎస్‌ఐ అమీర్‌ కేసు దర్యాప్తు చేశారు. అనుమానితులుగా లావాన్, సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను దిశ  మహిళా ఎస్‌ఐ విచారించగా తనపై లైంగిక దాడి చేసింది లావాన్‌ మాత్రమేనని చెప్పింది. అయితే కేసు నమోదు సమయంలో ఇద్దరి పేర్లు ఉండడంతో సంజీవ్‌ డీఎన్‌ఏను పోల్చి, సాంకేతికంగా అతని పాత్ర లేదని తేలిన తర్వాత నిర్దోíÙగా భావిస్తామని స్పష్టం చేశారు. నిందితుడు గల్లా లావాన్‌ను  కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. దిశ నరసరావుపేట డీఎస్పీ యు.రవిచంద్ర, పిడుగురాళ్ళ రూరల్‌ సీఐ వీరాంజనేయ, రాజుపాలెం ఎస్‌ఐ అమీర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు