పిల్లి కోసం కిందకు వంగడంతో, గొలుసుతో పరార్‌

6 Sep, 2020 16:06 IST|Sakshi

సాక్షి, గన్నవరం: పాత సామాను కొంటానని నమ్మించిన ఓ దుండగుడు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. కేసరపల్లిలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో మూల్పూరు పద్మావతి అనే వివాహిత నివాసముంటోంది. శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు.. మీ ఇంట్లో పాత టీవీలు, లేదా సామానులు ఉంటే కొనుగోలు చేస్తాను ఉన్నాయా అని అడిగాడు. అలాంటివేమీ లేవని పద్మావతి సమాధానం ఇచ్చింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లి పిల్లలను చూసిన అతను ఒక పిల్లను ఇస్తే పెంచుకుంటానని కోరాడు.

దీనికి అంగీకరించిన పద్మావతి పిల్లి పిల్లను యువకుడికి అందించేందుకు కిందకు వంగింది. అదే సమయంలో యువకుడు ఆమె మెడలో ఉన్న 6 కాసుల బంగారు గొలుసు లాక్కొని, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బైక్‌పై పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. రెప్పపాటులో మెడలో గొలుసు లాక్కొని దుండగుడు జారుకున్నాడని వాపోయింది. ఈమేరకు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు. (చదవండి: క‌రోనా బాధితురాలిపై డ్రైవ‌ర్‌ లైంగిక దాడి)

మరిన్ని వార్తలు