డబ్బులు జేబులో పెట్టుకొని సామాను సర్దుకోమన్నారు.. కిందకు వంగడంతో..

24 Nov, 2021 16:15 IST|Sakshi

లింగాలఘణపురం (ములుగు): లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన కిరాణ వ్యాపారిని తనిఖీ చేస్తున్నట్లు చేసి రూ.2 లక్షలు మాయం చేసి ఉడాయించారు. ఈ ఘటన వరంగల్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జెర్సీ పాలకేంద్రం సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు కొడితాల శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జెర్సీ పాలకేంద్రం సమీపంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో శేఖర్‌ బంధువు ప్లాటు కొనుగోలు చేయగా అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలతో పాటు కిరాణం సామాను కోసం మరో రూ.7వేలు తీసుకుని ఎక్సెల్‌ వాహనంపై జనగామకు బయలు దేరాడు.
(చదవండి: వైరల్‌: యమ ‘స్పీడ్‌’గా వెళ్తున్న కామారెడ్డి కలెక్టర్‌ వాహనం.. ఏకంగా రూ.27,580 చలాన్లు!)

నెల్లుట్ల బైపాస్‌ నుంచి సదరు వెంచర్‌ వద్దకు వెళ్లేందుకు యశ్వంతాపూర్‌ సమీపంలో ఉన్న బస్టాప్‌ వద్ద ఆగి బంధువుకు ఫోన్‌ చేశాడు. అతను కూడా వస్తున్నానని చెప్పడంతో వెంచర్‌ వద్దకు వెళ్తున్నాడు. అప్పటికే బస్టాప్‌ వద్ద బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని ముందుకు వెళ్లి అడ్డంగా బైక్‌ ఆపారు. వెంటనే ఒకరు దిగి ఫోన్‌ తీసుకుని, ఎక్సెల్‌ తాళం చెవి తీసుకున్నాడు. పెట్రోల్‌ పంపులో ఎవరిని కలిశావు.. ఏదో ఇచ్చావంటూ బుకాయించారు. నేను బంక్‌లోకి వెళ్లలేదని, ఎవరిని కలువలేదని చెబుతుండగానే సంచిలో ఏం ఉన్నాయి బయటకు తీయాలని ఆదేశించారు. సంచి తీయగానే జేబులో ఏం ఉన్నాయని గద్దించారు.

డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించగా డబ్బులు జేబులో పెట్టుకొని సంచిలో సామాను సర్దుకోమని చెప్పారు. వంగి సామాను సర్దుకుంటుండగానే జేబులోని డబ్బులు మాయం చేసి ఎక్సెల్‌ తాళం చెవితో బైక్‌పై పరారయ్యారు. సంచి సర్దుకుని జేబులో డబ్బులు చూసుకోగానే లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పటికే తన బంధువు అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి సదరు వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేశారు. నిడిగొండ వరకు వెళ్లి రఘునాథపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిధి తమకు లేదని, జనగామకు వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ బాలాజీవరప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు.    
(చదవండి: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి)

మరిన్ని వార్తలు