తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

7 Apr, 2022 07:41 IST|Sakshi

సాక్షి, మియాపూర్‌: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తుపాకీ తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని  మియాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏసీపీ కృష్ణప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన గౌతమ్‌ కుమార్‌ ఠాకూర్‌  అమీన్‌పూర్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బీహార్‌కు చెందిన వికాస్‌ అనే వ్యక్తి నుంచి రూ.20 వేలకు దేశీ తుపాకీ(7.65) తీసుకువచ్చి మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు పథకం పన్నాడు.

దీనిపై సమాచారం అందడంతో మియాపూర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బొల్లారం రోడ్డులో ఆటోలో వస్తున్న గౌతమ్‌కుమార్‌ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి లైసెన్స్‌ లేని పిస్తొల్, మూడు బుల్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ తిరుపతిరావు, ఎస్‌ఓటీ పోలీసులు నర్సింహారెడ్డి, ఎస్‌ఐ యాదగిరిరావు, డీఐ కాంతారెడ్డి, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం)

మరిన్ని వార్తలు