Jubilee Hills Amnesia Pub Case: జువైనల్‌ హోమ్‌కు ఎమ్మెల్యే కుమారుడు 

9 Jun, 2022 00:41 IST|Sakshi

అతడి సమీప బంధువైన మరో మైనర్‌ కూడా.. 

పోలీసు కస్టడీకి ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ 

నేటి నుంచి నాలుగు రోజుల పాటు విచారించనున్న పోలీసులు 

క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేయడానికి సన్నాహాలు

మిగతా ఐదుగురు మైనర్లనూ కస్టడీకి కోరుతూ పిటిషన్‌ 

నిందితులకు పొటెన్సీ టెస్టులు చేయించాలని నిర్ణయం 

గ్యాంగ్‌ రేప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో మైనర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం జువైనల్‌ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జువైనల్‌ హోమ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇచి్చంది. మిగతా ఐదుగురు మైనర్లనూ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఒకే కేసు.. రెండు కోర్టుల పరిధిలో.. 
ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన ముగ్గురు మైనర్లను సైదాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌నూ కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అదే హోమ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఓ చిత్రమైన అంశం వెలుగులోకి వచి్చంది. సాధారణంగా ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక డిజిగ్నేటెడ్‌ కోర్టు ఉంటుంది. గ్యాంగ్‌ రేప్‌ జరిగిన జూబ్లీహిల్స్‌ ఠాణా నాంపల్లిలోని పదిహేడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఠాణాలో నమోదైన కేసుల విచారణ, నిందితుల హాజరు వంటివన్నీ ఆ కోర్టులోనే జరుగుతాయి.

అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులు మాత్రం నాంపల్లి సెషన్స్‌ కోర్టు పరిధిలోకి వెళ్తాయి. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో పట్టుబడిన వారిని మాత్రం రెండు వేర్వేరు కోర్టుల్లో హాజరుపర్చాల్సి వచి్చంది. ఈ కేసులో పోక్సో యాక్ట్‌ కూడా ఉండటంతో సాదుద్దీన్‌ను దానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మిగతా వారంతా మైనర్లు కావడంతో వారిని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ సమీపంలోని జువైనల్‌ జస్టిస్‌ కోర్టులో హాజరుపర్చారు. వీరి కస్టడీ పిటిషన్లను సైతం పోలీసులు రెండు న్యాయస్థానాల్లో వేర్వేరుగా దాఖలు చేయాల్సి వచ్చింది. 

రేపటి నుంచి పోలీసు కస్టడీకి.. 
సామూహిక అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం సాదుద్దీన్‌ను 4 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పోక్సో కోర్టు బుధవారం నిర్ణయం తీసుకుంది. పోలీ సులు గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అతడితో క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయాలని నిర్ణయించారు. నిందితుడిని తీసుకుని పబ్, కాన్సూ బేకరీలతోపాటు అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. నిందితుడు, మిగతా మైనర్లు ఏ సమయంలో, ఎక్కడ, ఏం చేశారనేది తెలుసుకోనున్నారు. నేరం తర్వాత వారు వెళ్లిన ప్రాంతాలు, ఇన్నోవా దాచిన చోటుకూ నిందితుడిని తీసుకువెళతామని అధికారులు తెలిపారు. నేర నిరూపణలో ఇది కీలకాంశమని వెల్లడించారు. ఇక మరో ఐదుగురు మైనర్‌ నిందితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా జువైనల్‌ జస్టిస్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. 

పొటెన్సీ టెస్ట్‌ చేయించి.. 
గ్యాంగ్‌ రేప్‌ కేసులో పట్టుబడిన ఆరుగురిలో ఒకరే మేజర్‌కాగా మిగతా వారంతా మైనర్లు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి ప్రభుత్వ వైద్యుల ద్వారా పొటెన్సీ టెస్ట్‌ చేయించనున్నారు. ఈ పరీక్ష ద్వారా నిందితులకు లైంగిక పటుత్వం ఉందా? లేదా? అనేది వైద్యపరంగా నిర్ధారిస్తారు. అభియోగపత్రం (చార్జిïÙట్‌) దాఖలుకు ఇది కీలకం కావడంతో ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు నిర్ణయించారు. మరోవైపు సాదుద్దీన్‌ సహా ఆరుగురి గత చరిత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

బాలికపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో ఇన్నోవా కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండి ఉంటుందని.. స్వాధీనం చేసుకునేప్పుడు అది లేదని పోలీసులు చెప్తున్నారు. ఓ నిందితుడిని పోలీసులు విచారించిన సమయంలో అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ లేదని, కేవలం తెరలతో కూడిన షీల్డ్స్‌ ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. దీంతో కారు అద్దాలపై ఫిల్మ్‌ ఉండేదా? అనేది నిపుణుల సాయంతో గుర్తించాలని నిర్ణయించారు. ఫిల్మ్‌ ఉండి, తర్వాత తొలగించినట్టు తేలితే.. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఐపీసీలోని 201 సెక్షన్‌ను జోడించాలని భావిస్తున్నారు.

కారుపై రాని క్లారిటీ!
బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన దినాజ్‌ జహాన్‌ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజి్రస్టేషన్‌ నంబర్‌ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు.

మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్‌ జహాన్‌తో పాటు వక్ఫ్‌ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్‌ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్‌ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు