సాయం చేయబోతే..ఫోన్‌ మాయం

25 Aug, 2021 15:18 IST|Sakshi
చోరీ జరిగిన ప్రదేశాన్ని చూపుతున్న హెచ్‌ఎం రామారావు 

సాక్షి, కల్లూరు (ఖమ్మం): బైక్‌పై నుంచి పడిన వ్యక్తిని పైకి లేపుదామని సాయం చేయబోయిన హెచ్‌ఎం ఫోన్‌ అపహరణకు గురైంది. నారాయణపురంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంగా రామారావు పెనుబల్లి నుంచి వచ్చి మంగళవారం కల్లూరులోని ఎన్నెస్పీ బస్టాప్‌ వద్ద దిగారు. అకస్మాత్తుగా బైక్‌పై వచ్చిన ఓ యువకుడు అక్కడే కిందపడ్డాడు. ‘అబ్బా..లేపండి సార్‌’ అంటూ కోరడంతో సాయం చేస్తుండగా..అంతలోనే మరో వ్యక్తి వచ్చి చేరాడు.

అతడిని పైకిలేపుతున్నట్లు నటిస్తూ రామారావు చొక్కా జేబులో ఉన్న రూ.30వేల ఫోన్‌ను తస్కరించి..అంతకుముందే పడిన యువకుడితో కలిసి పరారయ్యారు. కాసేపటి తర్వాత ఈయన తేరుకుని గుర్తించి..ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే..సాంకేతిక లోపంతో 15రోజులుగా సీసీ కెమెరాలు పని చేయట్లేదని వారు తెలపడంతో..ఉసూరుమంటూ నారాయణపురంలో పాఠశాల విధులకు వెళ్లిపోయారు. 

చదవండి: సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం

మరిన్ని వార్తలు