రేప్‌ కేసులో బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

7 Sep, 2020 13:47 IST|Sakshi

డెహ్రాడూన్‌: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఆయన భార్యపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే దంపతులపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని నెహ్రూ కాలనీ పోలీసులు తెలిపారు. కాగా, మహేశ్‌ నేగి తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆయన కారణంగా పాపకు జన్మనిచ్చానని ఓ మహిళ ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అవసరమనుకుంటే తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఆమె కోరింది. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకుల కుట్రలతోనే తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే నేగి చెప్పుకొచ్చారు. ఏ విచారణకు సిద్ధమని ప్రకటించారు. కాగా, బాధిత మహిళ ఫిర్యాదుతో ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ మేరకు ఎమ్మెల్యేపై దంపతులపై కేసులు నమోదు చేశారు. ద్వారాహత్‌ నియోజకవర్గం నుంచి నేగి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
(చదవండి: కాంగ్రెస్‌ కుట్రలకు ఆధారాలున్నాయి: బీజేపీ ఎమ్మెల్యే)

మరిన్ని వార్తలు