Nellore Crime: విదేశీ యువతిపై అత్యాచారయత్నం 

9 Mar, 2022 04:03 IST|Sakshi

నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకుల దాష్టీకం 

వారి నుంచి తప్పించుకున్న మహిళ

ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు 

గంటలోనే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు  

సైదాపురం/గూడూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భారత దేశ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లిథువేనియా దేశానికి చెందిన ఓ యువతి (26) భా రత దేశం పర్యటనకు వచ్చింది. సోమవారం శ్రీలం క నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. గో వా వెళ్లేందుకు చెన్నై నుంచి బెంగళూరుకు బస్సులో బయల్దేరింది. ఆమె వద్ద ఇండియన్‌ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్‌ ఆమెను బస్సు నుంచి దించేశా డు.

అదే బస్సులోనే ఉన్న నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళెం గ్రామానికి చెందిన ఇంగిలాల రమణయ్య కుమారుడు సాయికుమార్‌ ఆమెకు తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చాడు. ఆమెను పరిచయం చేసుకున్నాడు. సందర్శనీయ స్థలాలు చూపిస్తానని నమ్మించి తన స్వగ్రామం బద్దెవోలు వెంకన్నపాళెంకు తీసుకొచ్చాడు. గూడూరు రూరల్‌ పరిధిలోని ఎల్‌ఏపీ స్కూల్‌ ప్రాంతంలోని శారదానగర్‌కు చెందిన తన స్నేహితుడు షేక్‌ అబిద్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పథకం రూపొందించాడు. మంగళవారం ఆమెకు కృష్ణపట్నం పోర్టు చూపుతామని చెప్పి, అబీద్‌తో కలిసి మోటార్‌ బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు.
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు 

సైదాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయాలనుకున్నారు. ఆ ప్రాంతం అనుమానాస్పదంగా ఉండడంతో వారి నుంచి తప్పించుకుని ఆ యువతి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా భయంతో నిలబడ్డ ఆ యువతిని చూసి స్థానికులు సైదాపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఈలోగా యువకులిద్దరూ పరారయ్యారు. జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాలతో డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసులరెడ్డి, సైదాపురం, గూడూరు రూరల్, మనుబోలు ఎస్సైలు టీంలుగా ఏర్పడి గాలించి నిందితులను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు