కుమార్తెపై ఆరు నెలలుగా అత్యాచారం 

21 Jul, 2021 04:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోక్సో చట్టం కింద కేసు నమోదు 

వెంకటగిరి: తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు. తర్వాత వివాహమై ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం కలిగిన మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ మహిళ, తన ఇద్దరు బిడ్డలు, అంజయ్యతో కలిసి ఉంటోంది. ఆమె కుమార్తెపై కన్నేసిన ఈ కామాంధుడు గత 6 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి బాలికను అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు.

గమనించిన పదేళ్ల కుమారుడు కేకలు వేయగా స్థానికులు ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో గుట్టు రట్టయింది. అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక మహిళా సంఘం నాయకురాలు మునేశ్వరి, ఐసీడీఎస్‌ సీడీపీవో జ్యోతి, వలంటీర్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటరాజేష్‌ విచారించి కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి మంగళవారం రాత్రి బాధితుల నివాసం వద్దకు స్వయంగా చేరుకొని ఘటనపై ఆరా తీశారు. 

మరిన్ని వార్తలు