ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

24 Sep, 2020 11:24 IST|Sakshi

చిన్నారి అదృశ్యంపై తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

రైల్వేస్టేషన్‌ సమీపంలో చిన్నారిపై లైంగికదాడి చేసి వదిలి వెళ్లిన 50 ఏళ్ల వ్యక్తి

సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

పేరేచర్ల (తాడికొండ): అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. మేడికొండూరు సీఐ ఆనందరావు కథనం మేరకు. పేరేచర్ల శివపార్వతి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారి మంగళవారం సాయంత్రం తన బంధువైన మరో బాలుడితో కూడలికి వెళ్లింది. కొంత సేపటి తరువాత చిన్నారి కనిపించక పోవటంతో ఆమెతో వెంటన వచ్చిన బాలుడు ఇంటికి వెళ్లి బాలిక కనిపించలేదని చెప్పడంతో కంగారుపడిన తల్లి వెంటనే మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో పేరేచర్ల రైల్వేస్టేషన్‌లో ఆమెను గుర్తించారు. 

నేరం ఒప్పుకున్న నిందితుడు
అర్బన్‌ ఎస్సీ అమ్డిరెడ్డి సారథ్యంలో, సౌత్‌ డీఎస్సీ కమలకర్‌రావు ఆధ్వర్యంలో మేడికొండూరు సీఐ ఆనందరావు తన సిబ్బందితో చిన్నారిని గుర్తించేందుకు కూడలిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. 50 సంవత్సరాల వ్యక్తి చిన్నారిని తన భుజాలపై ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలను గమనించారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు నల్లపాడుకు చెందిన స్వామిగా గుర్తించి, బుధవారం మధ్యాహ్నం పేరేచర్ల సమీపంలో అరెస్టు చేశారు. తమదైన శైలిలో పోలీసులు అతడిని విచారించగా చిన్నారిని తీసుకెళ్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో లైంగికదాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామని సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు