Warangal: పట్టపగలే సినీఫక్కీలో భారీ చోరీ..

16 Nov, 2021 14:15 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న డీసీపీ పుష్పారెడ్డి

సాక్షి, వరంగల్‌: అత్యంత రద్దీగా ఉండే నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో పట్టపగలే సినీఫక్కీలో చోరీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నక్కలగుట్టలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముందు నిలిపి ఉంచిన కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 25లక్షల నగదును దుండగులు అపహరించారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ ఎ.రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశ్‌రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్‌రోడ్డులోని ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లాడు.

చిన్నకుమారుడు కృష్ణవంశీ తన అకౌంట్‌నుంచి రూ.5లక్షలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లిపోయాడు. అనంతరం పెద్దకుమారుడితో కలిసి నక్కలగుట్టలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు వెళ్లిన తిరుపతి తన అకౌంట్‌లో ఉన్న రూ.10లక్షలు, భార్య భాగ్యలక్ష్మి పేరుమీద ఉన్న రూ.5 లక్షలు, పెద్ద కుమారుడు సాయితేజ అకౌంట్‌లో ఉన్న రూ.5లక్షలు డ్రా చేశాడు. మొత్తం డబ్బులను బ్యాగులో సర్దగా, పెద్దకుమారుడు తీసుకెళ్లి బ్యాంకు ముందు పార్క్‌ చేసిన కారులో పెట్టాడు.

ఆ సమయంలో బ్యాంకునుంచి సంతకం కోసం ఫోన్‌ రావడంతో కారును లాక్‌ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చాడు. అప్పటికే కారు అద్దాలు పగిలి ఉన్నాయి. పరిశీలించగా కారులో పెట్టిన డబ్బుల బ్యాగు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భూమి కొనుగోలు కోసం బ్యాంకులో ఉన్న డబ్బులను తీసినట్లు తిరుపతి కన్నీటిపర్యంతమయ్యాడు. 

సంఘటనాస్థలాన్ని పరిశీలించిన డీసీపీ 
సంఘటనా స్థలాన్ని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్పారెడ్డి పరిశీలించారు. బాధితుడినుంచి వివరాలు సేకరించారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు నిందితులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఒకరు చోరీ చేసి బ్యాగ్‌తో ముందుకువెళ్లగా, మరో నిందితుడు ద్విచక్ర వాహనంపై వచ్చి తీసుకెళ్లినట్లు డీసీపీ తెలిపారు.

నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీసీపీవెంట కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు