బతుకుబండి  ట్రాక్‌ తప్పుతోంది!

17 Aug, 2022 08:43 IST|Sakshi

బనశంకరి: రాష్ట్రంలో రైలు పట్టాలు రక్తసిక్తమవుతున్నాయి. అందమైన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతోంది. గత మూడేళ్లలో రైలు కిందపడి 1,455 మంది ఆత్మహత్య చేసుకోగా, 7 ఏళ్లలో  రైల్వే ప్రమాదాల వల్ల 5,210 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2020లో 413 మంది రైలు కిందపడి ప్రాణాలు తీసుకోగా, 2021లో ఈ సంఖ్య 668 మందికి పెరిగింది. గత 6 నెలల్లో 374 మంది ఇలా తనువు చాలించారు. రెండేళ్ల కాలంలో చూస్తే ఇందులో పురుషులు 1,305 మంది, మహిళలు 150 ఉన్నారని  రైల్వేపోలీసులు తెలిపారు.

ఆత్మహత్యలకు కారణాలేమిటి?  

  • రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుటుంబ సమస్యలు, ప్రేమ వైఫల్యం, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్‌ కావడం, వరకట్న వేధింపులు బలమైన కారణాలుగా ఉంటున్నాయి. ఇందులో యువకుల సంఖ్య  ఎక్కువగా ఉంది.  
  •  పట్టాల మీద తలపెట్టి ప్రాణాలు తీసుకోవడం ఇటీవల ఎక్కువగా నమోదవుతోందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ విధంగా చేస్తే కచ్చితంగా చనిపోతామనే భావనతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని మానసిక నిపుణులు పేర్కొన్నారు. 
  • కొన్నిచోట్ల హత్య చేసి ఆత్మహత్య అనిపించడానికి రైలు పట్టాలపై మృతదేహాలను పడేస్తున్న ఉదంతాలు చాలా ఉన్నాయని రైల్వే పోలీసులు చెప్పారు.  
  • ఈ విషయమై రైల్వే పోలీస్‌ ఎస్పీ డీఆర్‌ సిరిగౌరి మాట్లాడుతూ జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఆత్మహత్యకు పాల్పడటం సరికాదు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే కేసుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.  
  • రైలు ప్రమాదాలూ తక్కువ కాదు 
  • ప్రతినెలా సరాసరి 55– 60 మంది రైల్వే ప్రమాదాలకు బలి కావడం గమనార్హం. రైలు వస్తోందా లేదా అని చూడకుండా పట్టాలు దాటడం, ఇయర్‌ ఫోన్లలో సంగీతం వింటూ, మొబైల్‌లో మాట్లాడుతూ దాటడం, ఖాళీగా ఉన్న ట్రాక్‌పై వాకింగ్‌ చేయడం, నిద్రించడం, సెలీ్ఫలు తీసుకోవడం రైలు ప్రమాదాలకు కారణాలు. ఇలా 2017లో 654 మంది, 2018లో 487, 2019లో 614 మంది, 2020 నుంచి 2022 జూన్‌ వరకు 826 మందికి పైగా బలయ్యారు. 

(చదవండి: పక్కా ప్లాన్‌తో అంగన్‌వాడీ సెంటర్‌ పక్కనే ఇల్లు అద్దెకు.. జెండా వందనం చేశాక...)

మరిన్ని వార్తలు