కన్నుపడితే లూటీ ! 40 ఏళ్లుగా దొం‍గతనాలే వృత్తి

28 Aug, 2022 10:12 IST|Sakshi
పట్టుబడిన ఘరానా దొంగ ప్రకాష్‌

బనశంకరి: 40 ఏళ్లకు పైబడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను  శనివారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. దొంగ ప్రకాష్‌ (54), కోలారు, శివమొగ్గ  బళ్లారిలో మొత్తం మూడు వివాహాలు చేసుకోగా  ఇతడికి 7 మంది సంతానం. ఇప్పటి వరకు ఇతనిపై 160 కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, కోలారు, బళ్లారి, శివమొగ్గ, చిత్రదుర్గ, గుల్బర్గా తో పాటు గోవా, కేరళలో చోరీలకు తెగబడ్డాడు. 20 సార్లకు పైగా  జైలుకెళ్లి వచ్చాడు.  

10 ఏళ్ల వయసులో తొలిసారి 
1978లో ప్రకాష్‌ 10 ఏళ్ల బాల్యంలోనే తొలి చోరీ చేశాడు. తరువాత సహోదరుడు వరదరాజ్, పిల్లలు బాలరాజ్, మిథున్, అల్లుడు జాన్‌ కలిశారు. ఈ నెల 22 తేదీన రాజాజీనగరలో ప్రకాష్‌ చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు.  

కేజీల కొద్దీ పసిడి దోపిడీ 
1978–1986 వరకు 100 ఇళ్లలో చోరీలు చేశాడు. అప్పట్లో ప్రకాష్‌ కేరళ కొట్టాయంలో 2.5 కిలోల బంగారం చోరీ, శేషాద్రిపురంలో బంగారు దుకాణం గోడ కు కన్నం వేసి రెండున్నర కిలోల బంగారు నగల ఆభరణాలు దోపిడీ, మరో బంగారు షాపునకు కన్నం వేసి 4 కిలోల పసిడి నగలు లూటీ, 20 కిలోల వెండి చోరీకి పాల్పడ్డాడు. అనుచరులైన జోసెఫ్, ఆనందన్, బాషా సహకరించారు. దోచుకున్న నగదును పంచుకుని జల్సాలు చేసేవారు.  
వైరముడి, నాగేశ్‌ అనే అనుచరులతో కలిసి ప్రకాష్‌ 1989లో మైసూరులో 20 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 

  • 1992 లో నాగేశ్‌ తో కలిసి మహారాష్ట్ర కొల్హాపురలో రెండు బంగారు దుకాణాలకు కన్నంవేసి 17 కిలోల బంగారు ఆభరణాలు దోపిడీచేశారు.  
  • 1992లో శివమొగ్గ ఫైనాన్స్‌ కార్యాలయం నుంచి రూ.3 కోట్లు నగదు దోపిడీకి పాల్పడ్డాడు. 1997లో గోవాలో 7 కిలోల స్వర్ణాభరణాలను ఎత్తుకెళ్లాడు.  
  • 2006 నుంచి ప్రకాష్‌ తన పిల్లలైన మిథున్, బాలరాజ్‌ తో పాటు   అల్లుడు, అతని పిల్లలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.  
  • విలాసవంతమైన ఇళ్లు, జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్‌ కార్యాలయాలను ఎంచుకుని కొల్లగొడతాడు. ప్రతిసారి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినప్పటికీ బయటికి వచ్చి కొత్త ముఠాను ఏర్పాటు చేసుకునేవాడు. 

(చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!)

మరిన్ని వార్తలు