ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇరువురి పరిస్థితి విషమం

29 Oct, 2022 09:31 IST|Sakshi
మృతిచెందిన కూతురు శిరీష, లక్ష్మి (ఎడమవైపు) కుడివైపు ఉన్నవారు ప్రకాష్, మానస గాయపడ్డారు (ఫైల్‌)   

హైవేపై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు 

తల్లీకూతురు మృతి.. తండ్రి మరో కూతురికి గాయాలు 

సాక్షి, ఎర్రవల్లి చౌరస్తా/ బాన్సువాడ టౌన్‌ (బాన్సువాడ): దైవదర్శనానికి కారులో వెళ్తున్న ఓ కుటుంబం జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటిక్యాల మండలంలోని ధర్మవరం స్టేజీ సమీపంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కోదండాపురం ఎస్‌ఐ వెంకటస్వామి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ప్రకాష్, భార్య లక్ష్మి(50), కూతుళ్లు శిరీష(21), మానసతో కలిసి తిరుపతి దర్శనం కోసం శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఇటిక్యాల మండలంలోని ధర్మవరం స్టేజీ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను వెనక నుంచి కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లక్ష్మి, శ్రీలత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రకాష్, మానసలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దైవ దర్శనానికి వెళ్తుండగా తల్లి, సోదరి మృతిచెందడంతో మానస కన్నీరుమున్నీరైంది. ప్రకాష్‌ మద్నూర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రకాష్‌కు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివా హం కాగా శిరీష, మానస చదువుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు