తల్లీకొడుకును బలిగొన్న ప్రేమ.. 3 రోజుల కిందట కొడుకు.. ఇప్పుడు తల్లి!

30 Jul, 2022 18:16 IST|Sakshi
వరలక్ష్మి, శివకుమార్‌ (ఫెల్‌)  

సాక్షి, మెదక్‌: ఓ యువకుడి ప్రేమ వ్యవహారం ఇద్దరిని బలిగొంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది యువకుడు మూడు రోజల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి శుక్రవారం తెల్లవారు జామున చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేటకు చెందిన కటిక శివకుమార్‌ (21) నార్సింగికి చెందిన బాలికను ప్రేమించి రెండు నెలలక్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈనెల 14వ తేదీన ఆ అమ్మాయి మేజర్‌కాగా, తన ఇంటికి రావాలని  శివకుమార్‌ పలుమార్లు  ఫోన్‌చేసినా ఆమె స్పందించలేదు.

దీనితో మనస్తాపానికి గురైన శివకుమార్‌ మూడు రోజలక్రితం పట్టణ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లడిల్లిన  తల్లి వరలక్ష్మి (42)  మూడు రోజులుగా నిద్రాహారాలు మాని విలపించసాగింది. అందరూ నిద్రించిన తరువాత శుక్రవారం తెల్లవారుజామున పాండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం వరలక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. చెరువు కట్టవద్ద చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా ఆమె మృతదేహం లభ్యమైంది. భార్య, కుమారుడి మరణంతో భర్త లక్ష్మణ్‌ మాత్రమే మిగిలాడు. ఎస్‌ఐ రాజేశ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు