ఈ తల్లీపిల్లలు ఏమయ్యారో..?

20 Oct, 2020 08:44 IST|Sakshi
అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు,(ఇన్‌సెట్‌) శ్రీలేఖ (ఫైల్‌)

షాపింగ్‌కు వెళ్లి అదృశ్యం

కిడ్నాప్‌నకు గురై ఉండొచ్చని అనుమానం?

సీసీ పుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, తిరుపతి: షాపింగ్‌కంటూ ముగ్గురు పిల్లలతో వెళ్లిన తల్లి అదృశ్యమైన సంఘటన తిరుపతిలో కలకలం రేపింది. వివరాలు.. స్థానిక కెనడీనగర్‌కు చెందిన శివకుమార్, శ్రీలేఖ దంపతులకు దీక్షితశ్రీ, తేజస్విశ్రీ, కార్తీక్‌ సంతానం. శ్రీలేఖ ముగ్గురు పిల్లలతో ఆదివారం మధ్యాహ్నం రిలయన్స్‌ మార్ట్‌కు వెళ్లింది. షాపింగ్‌ అనంతరం భర్తకు కాల్‌ చేసి మాట్లాడింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆమె మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. భార్యాపిల్లల కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో శివకుమార్‌ ఫిర్యాదు చేశారు.   (రాళ్లతో దాడికి తెగబడి.. కాల్పులు జరిపేందుకు..)

రిలయన్స్‌ మార్ట్‌ నుంచి తన ముగ్గురు పిల్లలతో శ్రీలేఖ రోడ్డుపై వెళుతున్నట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. దీంతోపాటు బస్టాండ్, రైల్వే స్టేషన్, నగరంలోని కొన్ని ప్రముఖ కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, తన భార్యతో ఎలాంటి గొడవలూ లేవని, ఎవరితో కూడా తమ కుటుంబానికి శత్రుత్వం లేదని శివకుమార్‌ పేర్కొన్నారు. శ్రీలేఖ తల్లిదండ్రులు సైతం పోలీసులకు ఇదే మాట స్పష్టం చేశారు. బహుశా తన భార్యాపిల్లలను ఎవరైనా కిడ్నాప్‌ చేశారేమోనని శివకుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ మిస్సింగ్‌ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు