కన్నపేగును తెంచుకుని..

29 Aug, 2022 01:29 IST|Sakshi

కొడుకును సంపులోకి తోసేసి తల్లి ఆత్మహత్య

కొడుక్కి శారీరక వైకల్యం.. తల్లి అంధురాలు 

కల్హేర్‌(నారాయణఖేడ్‌): కుటుంబానికి భారంగా మారొద్దని భావించిన అంధురాలైన ఓ తల్లి, దివ్యాంగుడైన కొడుకు బలవన్మర ణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలో ఆదివారం చోటుచేసుకుంది. మాసాన్‌పల్లికి చెందిన కమ్మరి గంగామణి(55), చంద్రయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

గంగామణి అంధురాలు కాగా, కొడుకు సంగమేశ్వర్‌(35) శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమె కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కొడుకుతోపాటు తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో కుటుంబానికి భారంగా మారామని మథనపడుతోంది. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కొడుకుతోసహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది.

ఇటీవల చంద్రయ్య కొత్తగా నిర్మించిన ఇంటి ఆవరణలోని సంపులోకి సంగమేశ్వర్‌ను తోసేసింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె కూడా అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని కల్హేర్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు