కొడుకు వివాహం చేసుకోవడం లేదని తల్లి షాకింగ్‌ నిర్ణయం

28 Feb, 2023 15:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తాడేపల్లి రూరల్‌: ఓ కన్న తల్లి తన కొడుకు వివాహం చేసుకోవడం లేదని మనస్తాపం చెంది కొడుకుతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాడేపల్లి ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాలు.. మంగళగిరి మురుగుడు హనుమంతరావు కాలనీకి చెందిన ఆకురాతి వెంకటరమణమ్మ(45) తన చిన్న కుమారుడు లక్ష్మణ్‌ వివాహం చేసుకోవడం లేదని మనస్తాపం చెంది కొడుకుతో గొడవపడి ఇంట్లో నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయటకు వెళ్లింది.

అప్పటి నుంచి పెద్ద కొడుకు రాము, చిన్న కుమారుడు లక్ష్మణ్‌ బంధువుల ఇళ్లలోను, ఇతర ప్రాంతాల్లో ఎంక్వయిరీ చేశారు. ఎటువంటి సమాచారం లభించలేదు. సోమవారం ఉదయం కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్‌ఐ రమేష్‌ ఘటనా స్థలానికి వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి సమాచారం కోసం మహిళా పోలీసుల గ్రూపులో వెంకటరమణమ్మ మృతదేహం ఫొటోను పోస్ట్‌ చేశారు. మంగళగిరి మహిళా పోలీసులు వెంకటరమణమ్మగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: ప్లే స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బలవన్మరణం  

మరిన్ని వార్తలు