దేవుని మాలలో ఉండి దారుణం..కూతురు కోసం వచ్చి అత్తపై దాడి

9 Dec, 2022 12:06 IST|Sakshi
లక్ష్మీ అల్లుడు సతీశ్‌, కూతురు పద్మ

సాక్షి, జ్యోతినగర్‌: కూతురి ఆచూకీ కోసం వచ్చిన ఓ తల్లిని ఆమె అల్లుడే క్షణికావేశంలో హతమార్చాడు. ఈ విషాద ఘటన ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కృష్ణానగర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన కాసు సతీశ్‌–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సతీశ్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్యతో గొడవలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి, మరో ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పద్మ తీవ్ర మనోవేదనకు గురై, ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు శృతి తండ్రి వద్దకు వెళ్లి, అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది.

దీంతో అతను తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని, ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రామయ్యపల్లెలో ఉంటున్న పద్మ తల్లిదండ్రులు ఈర్ల లక్ష్మీ(65)–రాజయ్యలకు సమాచారం అందించడంతో ఠాణాకు చేరుకున్నారు. అనంతరం మనవరాళ్లను చూసేందుకు కృష్ణానగర్‌ వెళ్లారు. ఇంట్లో అల్లుడు సతీశ్‌ కనిపించడంతో తమ కుమార్తె నీ మూలంగానే ఇంటి నుంచి వెళ్లిపోయి ందన్నారు. ఇది గొడవకు దారితీసింది.

క్షణికావేశంలో సతీశ్‌ తాను దేవుని మాల వేసుకున్న విషయాన్నీ మర్చి పోయి, అత్త లక్ష్మీపై దాడి చేశాడు. స్థానికులు అతన్ని సముదాయించి, స్పృహ కోల్పోయిన లక్ష్మిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై బి.జీవన్, పోలీసు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి చిన్న కుమారుడు గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీశ్‌పై హత్య కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు?
లక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న సతీశ్‌ తన మెడలోని మాల తీసివేశాడు. అనంతరం పోలీ స్‌స్టేషన్‌కు వెళ్లి, లొంగిపోయినట్లు సమాచారం. 

(చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య)

మరిన్ని వార్తలు