తల్లితో సహజీవనం; పెళ్లి చేసుకోవాని కూతురికి వేధింపులు

23 Apr, 2021 16:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అద్దంకి రూరల్‌: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమె ఇంట్లో లేని సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శారీరకంగా వేధిస్తున్నాడని గురువారం అద్దంకి పట్టణానికి చెందిన 9వ తరగతి చదువున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ మహేష్‌ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్‌లో నివాసం ఉంటున్న వీట్టెం మల్లికార్జునరావు, అరుణలకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి కుమార్తె తల్లి వద్దే ఉంటోంది. తల్లితో వివాహేతర సంబంధం ఉన్న వలబూని జానకిరామయ్య కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. రెండు నెలల నుంచి జానకిరామయ్య బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శారీరకంగా హింసిస్తున్నాడు.

తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు. ఈ విషయం తల్లికి చెప్పగా ఆమె కూడా జానకిరామయ్యకే మద్దతు పలుకుతూ నిన్ను అతనికిచ్చి పెళ్లి చెస్తానని అంటోందని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి అరుణ, జానకిరామయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు వయసుకొచ్చిన కుమార్తె ఉన్న తల్లి.. వేరొకరితో సహజీవనం చేయడమే కాకుండా.. అతడ్నే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బాలికను వేధించిన కామాంధుడు జానకిరామయ్యతో పాటు తల్లిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేస్తున్నాయి.

చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. టీచర్‌ మృతి.. చెత్తకుండీలో బిడ్డ! 

మరిన్ని వార్తలు