ప్రియుడిపై మోజు.. కన్నకూతుర్ని చంపిన తల్లి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్‌..

24 Dec, 2022 16:45 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహాలో షాకింగ్ ఘటన జరిగింది. సొంత తల్లే కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఈ క్రూర చర్యకు పాల్పడింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు నిందితులిద్దరినీ శనివారం అరెస్టు చేశారు.

హసన్‌పూర్‌ కోత్వాలి పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. నిందితురాలి పేరు స్మృతి రాణి వర్మ. ఆమె ప్రియుడి పేరు అనిల్ కుమార్. హత్యకు గురైన 16 ఏళ్ల బాలిక పేరు కుష్బూ వర్మ.

అయితే స్మృతి రాణి చాలా ఏళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయింది. ప్రియుడు అనిల్‌తో కలిసి జీవిస్తోంది. కూతురు కుష్బూ కూడా ఈమెతోనే ఉంటోంది. రాణి అనిల్‌తో ఉండొద్దని కుష్బూ తరచూ ఆమెకు చెప్పేది. తల్లి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసేది.

దీంతో తన కూతురు అడ్డుగా ఉందని బావించిన రాణి ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే తన కుమార్తె మృతిపై సుషీల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాణే ఆమెను చంపి ఉంటుందని అనమానం వ్యక్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాణి ఆమె ప్రియుడ్ని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు..

మరిన్ని వార్తలు