అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్‌? 

13 Jan, 2023 08:20 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, బళ్లారి అర్బన్‌: తాలూకాలోని మోకా పోలీస్టేషన్‌ పరిధిలో సింధవాళ దగ్గర తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ కాలువలోకి తల్లి ఇద్దరు బిడ్డలతో దూకింది. తల్లి గల్లంతు కాగా ఒక చిన్నారి చనిపోగా, మరో చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని గుగ్గరహట్టికి చెందిన లక్ష్మి(27)కి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హత్తిబెళగల్‌ గ్రామానికి చెందిన వెంకటేష్‌తో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.

రెండురోజుల కిందట భర్తతో గొడవపడి లక్ష్మి తన నలుగురు పిల్లల్లో ఇద్దరిని తీసుకుని గుగ్గరహట్టిలోని పుట్టింటికి వచ్చింది. తమ్ముడు సురేష్‌ బుజ్జిగించి భర్త ఇంటికి వెళ్లాలని ఆలూరు బస్సు ఎక్కించి పంపించాడు. భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని ఆమె మధ్యలో దిగిపోయి సింధవాళ దగ్గర ఉన్న కాలువలోకి పిల్లలతో కలిసి దూకింది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగున వచ్చి కాపాడేందుకు యత్నించారు. ఇద్దరు పిల్లలు వారి చేతికి దొరకగా, తల్లి కాలువలో కొట్టుకుపోయింది. అయితే వారిలో శాంతి అనే చిన్నారి మృతి చెందింది. వెన్నెల అనే చిన్నారి బతికినట్లు మోకా ఎస్‌ఐ పరశురామ్‌ తెలిపారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.    

(చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?)

మరిన్ని వార్తలు