నాలుగేళ్ల బాలుడిని హత్యచేసిన తల్లి!

14 Nov, 2020 08:39 IST|Sakshi

బాలుడి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

మోర్తాడ్‌: ఏర్గట్ల మండలం తొర్తిలో గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలుడు నాగేంద్ర(4)ను తల్లే చంపినట్లు అనుమానిస్తున్నారు.  తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఉరి వేసి చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దెయ్యాలు తమ మీదపడి దాడి చేశాయని కల్లబొల్లి కబుర్లు చెప్పే యత్నం చేసినా పోలీసుల విచారణలో నిజాలు తెలిసినట్లు సమాచారం. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలుడి మృతికి గల కారణాలను విశ్లేషించి ఒక నిర్దారణకు వచ్చారు. నాగేంద్ర తల్లి నవ్య తన చున్నీతో ఉరి వేయడంతోనే మరణించాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

నవ్య డిగ్రీ చదువుతున్న సమయంలో ఆర్మూర్‌ మండలం ఖానాపూర్‌కు చెందిన తన క్లాస్‌మెట్‌తో ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తుంది. అయితే ఆయనతో కాకుండా తాళ్లరాంపూర్‌కు చెందిన అభిషేక్‌తో ఆమె వివాహం అయింది. అయినా నవ్య ప్రియుడితో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నవ్య ప్రేమ విషయం తెలుసుకున్న అభిషేక్‌ కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఆమెను తల్లిగారి ఇంటివద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నవ్య పథకం ప్రకారం కొడుకును హత్య చేసినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు తెలిసింది. నవ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ కేసులో ఇంకా ఎవరి హస్తమైన ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. 

దర్యాప్తు కొనసాగుతోంది..
తొర్తిలో బాలుడి మృతి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భీమ్‌గల్‌ సీఐ సైదయ్య ఈ కేసును పరిశోధిస్తున్నారు. నాగేంద్ర మృతి వెనకు తల్లి నవ్య హస్తం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
– హరిప్రసాద్, ఎస్సై, ఏర్గట్ల  

మరిన్ని వార్తలు