భార్య నుంచి పారిపోవడానికి భర్త మాస్టర్‌ ప్లాన్‌!

5 Jul, 2021 19:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: దేశంలో కరోనా సృష్టించిన విధ్వంసం మనందరికి తెలిసిందే. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, కరోనా సోకిన వ్యక్తి, 14 రోజుల హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ సమయంలో వారితో ఎవరు కలవకుండా, సామాజిక దూరం పాటించాలన్న విషయం తెలిసిందే. అయితే, కొందరు ఈ నిబంధనను తమ వ్యక్తిగత విషయాల కోసం దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండోర్‌లోని మోవ్‌ అనే ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తికి గడిచిన ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అతనికి భార్య, ఇంట్లోవారితో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైle ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. కాగా, దీనికోసం ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. ఒక ప్రైవేటు ల్యాబ్‌ నుంచి కోవిడ్‌ సోకిన వ్యక్తి రిపోర్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. దానిపై అతని పేరును మార్చి, తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత , ఆ రిపోర్ట్‌ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్‌ చేశాడు.

అయితే, కుటుంబ సభ్యులు,ఈ వాట్సప్‌ చూసి షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అతనికి ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవు. దీంతో, వారికి తమ కుమారుని ప్రవర్తనపై అనుమానం కలిగింది. వారు వెంటనే ఆ వాట్సప్‌లో ఉన్న ప్రైవేటు ల్యాబ్‌ను వెళ్లి సంప్రదించారు. అప్పుడు వారికి తమ కొడుకు చేసిన మోసం బయటపడింది. దీంతో, ఆశ్చర్యపోయి, వారు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆ ల్యాబ్‌ టెక్నిషియన్‌ మాత్రం, తమ ల్యాబ్‌ రిపోర్ట్‌ను ఫోర్జరీతో మార్పిడి చేసినందుకుగాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గ్వల్టోలి పోలీసులు నిందితునిపై పలు సెక్షన్‌ల కింద కేసులను నమోదుచేశారు. 

మరిన్ని వార్తలు