పోస్ట్‌మాస్టర్‌ యవ్వారం.. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో కోటి లాస్‌.. అంతా మంది సొమ్మే!

25 May, 2022 08:38 IST|Sakshi

భోపాల్‌: తేరగా వచ్చే డబ్బును అనుభవించాలనుకుంటే.. ఆ కర్మఫలితాన్ని కూడా తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. మంది సొమ్ముతో ఐపీఎల్‌లో బెట్టింగ్‌ వేయడమే కాదు.. ఆ సొమ్మంతా పొగొట్టి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు ఓ పోస్ట్‌మాస్టర్‌. 

మధ్యప్రదేశ్‌ సాగర్‌ జిల్లా బినా సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో విశాల్‌ అహిర్‌వార్‌ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లలో బెట్టింగులు పెడుతున్నాడు అతను. ఈ క్రమంలో దాదాపు కోటి రూపాయలకు పైనే పొగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బంతా మంది సొమ్మని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సుమారు 24 కుటుంబాలకు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సొమ్మును ఐపీఎల్‌లో బెట్టింగ్‌ కోసం వాడుకున్నాడు.

విశాల్‌ చేసిన మోసం వెలుగులోకి రావడంతో మే 20న బినా గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో చేసిన తప్పును ఒప్పుకున్నాడు అతను. నిందితుడు పోస్ట్‌మాస్టర్ నకిలీ ఎఫ్‌డి ఖాతాల కోసం నిజమైన పాస్‌బుక్‌లను జారీ చేశాడని, గత రెండేళ్ల నుండి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చీటింగ్‌, ఖాతాదారులను మోసం చేయడం సెక్షన్‌ల కింద విశాల్‌ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు