ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్టు

2 Jan, 2021 19:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61) ని అరెస్ట్ చేశామంటూ శనివారం పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. 2008లో ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ లఖ్వీని తమ  కౌంటర్ టెర్రరిజం విభాగం (సీటీడీ) అరెస్టు చేసిందని పాక్‌ ప్రకటించింది. అయితే లఖ్వీని అరెస్టు చేసిన స్థలాన్ని అధికారులు ప్రస్తావించలేదు.

ముంబై దాడుల  మైస్టర్‌ మైండ్‌ లఖ్వీని అదుపులోకి తీసుకున్నామని పాక్ పోలీసు అధికారులు ప్రకటించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్నాడన్న ప్రధాన కారణంతోఅతడిని అరెస్ట్ చేసినట్టు సీటీడీ  తెలిపింది. లఖ్వీ ఒక డిస్పెన్సరీని నడుపుతూ, ఉగ్రవాద చర్యలకు, ఆ నిధులను ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు. ఈనిధులను ఉగ్రవాద ఫైనాన్సింగ్‌తో పాటు వ్యక్తిగత ఖర్చులకు కూడా ఉపయోగించాడని  పేర్కొంది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై లాహోర్‌లో నమోదైన కేసు ఆధారంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, ఆ సంస్థకు ఆర్థికంగా సాయం చేస్తున్న లఖ్వీని పట్టుకున్నామని పాక్ పోలీసులు వెల్లడించారు. అయితే లఖ్వీని ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేశారన్న వివరాలను మాత్రం పాక్ వెల్లడించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  కాగా ముంబై దాడుల కేసుల్లో లఖ్వీయే ప్రధాన సూత్రధారి. 2008 నవంబర్ 26 నుంచి నవంబర్ 29 వరకు ముంబైలోని ఎనిమిది ప్రాంతాల్లో వరుస బాంబు దాడులు చేసిన ఘటనలో ఏకంగా 173 మంది ప్రాణాలు కోల్పోయారు. 308 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్టయిన లఖ్వీ 2015 నుంచి బెయిల్‌పై ఉన్నాడు.

మరిన్ని వార్తలు