బంధువని నమ్మారు జైలు పాలయ్యారు... చివరికి

17 Apr, 2021 15:22 IST|Sakshi

ముంబై: ఖతర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టయిన మహమ్మద్ షరిఖ్, ఒనిబా ఖురేషి దంపతులు ఎట్టకేలకు నిర్దోషులుగా బయటపడ్డారు. 2019లో ఖతర్‌ న్యాయస్థానం ఈ జంటను దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో షరిఖ్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. భారత ప్రభుత్వాధికారులు ఖతర్ అధికారులతో ఈ దంపతుల విషయంలో అసలేం జరిగిందో వివరించారు. దాంతో గురువారం ఈ దంపతులు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు.

వివరాల ప్రకారం... 2019, జూలై 4న ఖతర్ వెళ్లేందుకు షరిఖ్ దంపతులు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి తబస్సుం ఖురేషి అనే బంధువు ఓ బ్యాగు ఇచ్చింది. దోహాలో బ్యాగు సంబంధించిన వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడని తబస్సుం చెప్పింది. ఆ సమయంలో అందులో ఏముందో అడగకపోవడమే వారి జీవితాన్ని జైలుపాలు చేసింది. దోహాలోని హమద్ విమానాశ్రయానికి చేరుకున్నాక ఎయిర్‌పోర్టులో లగేజీ తనిఖీ చేస్తుండగా షరిఖ్ దంపతుల బ్యాగులో 4.1 కిలోల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. దీంతో  ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు ఈ బ్యాగుతో ఎటువంటి సంబంధం లేదని ,తమ బంధువు తబస్సుం ఖురేషి ఇచ్చింది అని చెప్పినా అక్కడి పోలీసులు వినిపించుకోలేదు. చివరికి పోలీసుల చేతిలోంచి డ్రగ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ అనంతరం షరిఖ్ దంపతులను దోహా సెంట్రల్ జైలుకు తరలించారు.

పరాయి దేశంలో ఆ దంపతులు  ఏ తప్పు చేయలేదని నిరూపించుకోలేకపోయారు. దాంతో ఖతర్‌ న్యాయస్థానం వీరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షా సమయంలో ఒనిబా గర్భణి కూడా. ఈ క్రమంలో షరిఖ్ కుటుంబ సభ్యులతో సాయంతో తమకు న్యాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అధికారుల విచారణలో షరిఖ్ అత్త తబస్సుం ఖురేషి మాదకద్రవ్యాలను ఈ జంట బ్యాగులో వారికి తెలియకుండా పెట్టినట్లు తెలిసింది. అంతేగాక ఈ షరిఖ్ దంపతుల ఖతర్ యాత్రను కూడా తబస్సుం స్పాన్సర్ చేసినట్లు అధికారులు తేల్చారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారుల అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడి న్యాయస్థానం ఈ దంపతుల అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. విచారణ అనంతరం షరిఖ్ దంపతులను నిర్ధోషులుగా తేల్చిన కోర్టు.. మార్చి 29న వీరిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం ఈ దంపతులు స్వదేశానికి పయనమయ్యారు. అందుకే అపరిచితులనే కాదు ఒక్కోసారి పరిచయస్తులను కూడా నమ్మరాదని ఈ సంఘటన చెబుతోంది.

మరిన్ని వార్తలు