తగ్గిస్తే పోయేది.. కుదరదన్నాడు.. చివరికి ప్రాణమే పోయింది

9 Dec, 2021 20:14 IST|Sakshi

ముంబై: సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని మన పెద్దలు చెప్తుంటారు. అంతెందుకు మనం బాధలో ఉన్నప్పుడు మధురమైన సంగీతం వింటే చాలు మనసు కాస్త కుదుట పడుతుంది. కాకపోతే ఎదైనా సరే సృతి మించకుండా ఉండాలి లేదంటే వాటి పరిణమాలు తీవ్రంగా ఉంటాయి. ఎంతటి మధురమైన సంగీతమైన సరే త‌గిన మోతాదులో సౌండ్ పెట్టుకుని వింటేనే ఓ అందం వినే వాళ్లకి ఆనందం. కానీ అదే సౌండ్ పెద్ద‌గా పెడితే వినే వాళ్ల పరిస్థితి ఏమోగానీ పోరుగున ఉన్న వాళ్లకి చికాకు క‌లుగుతోంది. ఈ తరహాలోనే ఓ వ్య‌క్తి త‌న ఇంట్లో మ్యూజిక్ పెద్దగా పెట్టి.. చివరికి హత్యకు గురయ్యాడు.

వివ‌రాల్లోకి వెళితే.. ముంబైలోని అంబుజావాడి ప్రాంతంలో సురేంద్ర కుమార్ గున్నార్ అనే వ్య‌క్తి త‌న ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని వింటున్నాడు. కాకపోతే అదేదో చిన్నగా తనవరకు వినపడేలా కాకుండా పెద్దగా సౌండ్‌ పెట్టి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అంతలా శబ్ధం వస్తుండడంతో ఆ ఇంటి ప‌క్క‌నే ఉన్న సైఫ్ అలీ చంద్‌కు కాస్త చికాకు క‌లిగింది. దీంతో అతను సురేంద్ర కుమార్‌ వద్దకు వెళ్లి సౌండ్‌ తగ్గించమని కోరాడు. అందుకు సురేంద్ర కూమార్‌ ససేమిరా అన్నాడు. అసలే చిరాకు, అందులో అతను సౌండ్‌ తగ్గించేందుకు అంగీకరించకపోవడంతో సైఫ్ అలీ సురేంద్ర‌పై దాడి చేయడంతో అతను అక్కడే కుప్ప కూలిపోయాడు.  కుటుంబ స‌భ్యులు సురేంద్ర కుమార్‌ను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సైఫ్ అలీని అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి

మరిన్ని వార్తలు