రిజల్ట్స్‌ విడుదల చేస్తారా.. లేదంటే బాంబు వేయమంటారా?

14 Aug, 2021 16:24 IST|Sakshi

ముంబై విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు

ముంబై: మహారాష్ట్రలోని ముంబై విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫలితాలు విడుదల చేయకపోతే విశ్వవిద్యాలయాన్ని బాంబులు వేసి పేల్చేస్తామని ఈమెయిల్స్‌లో హెచ్చరికలు వచ్చాయి. డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల చేయకపోతే తాము చెప్పిన పని చేస్తామని స్పష్టం చేశారు. ఆ పని విద్యార్థులే చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

బ్యాచిల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకామ్‌) సెమిస్టర్‌ ఫలితాలు విడుదల చేయాలని విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ, మూల్యంకన విభాగం డైరెక్టర్‌ మెయిల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అధికారులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముంబై విశ్వవిద్యాలయం ఇటీవల చివరి సంవత్సర విద్యార్థుల సెమిస్టర్‌ ఫలితాలు ఆలస్యంగా విడుదల చేసింది. మిగిలిన వారి ఫలితాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులు విశ్వవిద్యాలయానికి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు