దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..

14 Dec, 2021 14:24 IST|Sakshi

Matheran Crime News: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌లో ఓ మహిళా పర్యాటకురాలు దారుణ హత్యకు గురైన సంఘటనలో రాయ్‌గఢ్‌ పోలీసులు ఒక ఐటీ ఇంజనీర్‌ను అరెస్ట్‌ చేశారు. పన్వేల్‌కు చెందిన రామ్‌పాల్‌ అనే వ్యక్తి తన భార్య పూనమ్‌పై అనుమానంతోనే ఆమెను లాడ్జిలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. మాథేరాన్‌లోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో గది కావాలని శనివారం సాయంత్రం ఓ జంట వచ్చింది. లాడ్జ్‌ సిబ్బంది నియమాల ప్రకారం ఆ జంట వివరాలు రిజిస్టర్‌లో రాసుకొని వారికి గది ఇచ్చారు. ఆదివారం ఉదయం లాడ్జ్‌ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి గది లోపలికి వెళ్లగా, బెడ్‌ కింద తల లేని మొండెం కనపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి భయపడిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అంతటా సోదా చేశారు. కానీ తల దొరకలేదు. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పన్వేల్‌లోని ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, దర్యాప్తులో భాగంగా తనిఖీ చేస్తుండగా, రిజిస్టర్‌లో రాసిన పేరు, చిరునామా తప్పుడు వివరాలని తేలింది. ఈ జంట నుంచి లాడ్జ్‌ యజమాని కేతన్‌ రమాణే ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు తీసుకోలేదు. దీంతో ఈ హత్య కేసు చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు, లాడ్జింగులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు.

చదవండి: (రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌ సూపర్‌ సక్సెస్‌)

మాస్క్‌ ధరించి ఉండటంతో ఆ మహిళ భర్త ముఖం గుర్తించడం కష్టతరంగా మారింది. ఇదిలావుండగా, సోమవారం ఉదయం మాథేరాన్‌లో ఓ చోట ఓ హ్యాండ్‌ బ్యాగ్‌ లభించింది. సీసీ టీవీ ఫుటేజ్‌లో మహిళ చేతిలో ఉన్న హ్యాండ్‌ బ్యాగు, పోలీసులకు దొరికిన బ్యాగు ఒకటేనని తేలింది. దీంతో ఆ బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను ముంబైలోని గోరేగావ్‌కు చెందిన 30 ఏళ్ల పూనమ్‌ పాల్‌గా గుర్తించారు. అదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా తమ కూతురు అదృశ్యమైనట్లు గోరేగావ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మృతదేహం పూనమ్‌దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

మరిన్ని వార్తలు