పక్కింటివాళ్లతో గొడవ.. 12వ అంతస్తు నుంచి దూకిన మహిళ

23 Jun, 2021 13:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: అసలే భర్తను కోల్పోయి బాధలో ఉంది. ఏడేళ్ల కుమారుడిని ఒంటరిగా ఎలా పెంచాలా అని భయపడుతుంది. ఈ సమయంలో మద్దతుగా నిలవాల్సిన ఇరుగుపొరుగు వారు.. ఆమెను ఇబ్బందులకు గురి చేయసాగారు. దాంతో డిప్రెషన్‌కు గురైన బాధితురాలు కొడుకుతో కలిసి 12వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ముంబై, చండీవాలి అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 

చండీవాలి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ట్రెంచిల్‌ అనే మహిళ భర్త కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ వల్ల మరణించాడు. ఈ క్రమంలో ట్రెంచిల్‌ తన ఏడేళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా నివస్తుంది. భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ సమయంలో మద్దతుగా ఉండాల్సిన ఇరుగుపొరుగు వారు ఆమెతో గొడవకు దిగారు. ట్రెంచిల్‌ కుమారుడు గొడవ చేస్తూ.. తమను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. 

అప్పటికే విషాదంలో ఉన్న ట్రెంచిల్‌ వారి మాటలతో మరింత బాధపడింది. డిప్రెషన్‌కు గురయ్యింది. ఈ క్రమంలో సోమవారం ఆమె, ఏడేళ్ల కుమారుడితో కలిసి తాను ఉంటున్న అపార్టమెంట్‌లోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పొరుగింట్లో ఉండే వ్యక్తి తనను సతాయిస్తున్నాడని.. ప్రతి దానికి తనతో గొడవపడుతున్నాడని.. అతడి వేధింపులు తట్టుకోలేకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆరోపిస్తూ సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న దాని ప్రకారం ట్రెంచిల్‌ పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

చదవండి: పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌: అత్యాచార నిందితుడికి బెయిల్‌

మరిన్ని వార్తలు