చేతబడి పేరుతో గిరిజనుడి హత్య

12 Oct, 2020 04:27 IST|Sakshi
శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసిన చోటును పరిశీలిస్తున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో దారుణం

కొత్తూరు: చేతబడి చేస్తున్నా డన్న నెపంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గిరిజన గ్రామంలో శనివారం అర్థరాత్రి ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లగూడకు చెందిన ఊలక రమేష్‌ అనే వ్యక్తి పది రోజుల కిందట మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఊలక నాయకమ్మ (44) చేతబడి చేయడం వల్లే మృతి చెందాడని అనుమానించిన రమేష్‌ బంధువులు మరికొందరితో కలిసి నాయకమ్మను తీవ్రంగా కొట్టారు. తర్వాత ఒడిశాలోని ఓ భూతవైద్యుడిని సంప్రదించి నాయకమ్మ చేతబడి చేశాడని నిర్ధారణకు వచ్చారు.

అనంతరం గ్రామానికి తిరిగివచ్చి నాయకమ్మను చంపేయాల్సిందిగా అతని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో శనివారం అర్ధరాత్రి నాయకమ్మను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లకు వైరు కట్టి, శ్మశానానికి తీసుకెళ్లి కొట్టి చంపారు. ఆనవాలు దొరక్కూడదని వెంటనే మృతదేహాన్ని దహనం చేశారు. విషయం తెలుసుకున్న పాలకొండ ట్రైనీ డీఎస్పీ ఎం.శ్రీలత, సీఐ చంద్రశేఖర్‌లు ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శివకృష్ణ, గంధర్వులు, దుర్గారావు, కరువయ్య, మో హనరావు, కామకృష్ణ, చిన్నారావు, ముఖ లింగం లతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు