మొబైల్‌ చార్జర్‌ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..

21 Aug, 2022 09:52 IST|Sakshi

బనశంకరి: మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను అడ్డుపెట్టుకుని నగ్నచిత్రాలను తీయడం మొదలుపెట్టాడో సైకో. వాటిని చూపి బెదిరిస్తున్న కామోన్మాదిని ఈశాన్య విభాగ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్పై కెమెరా వినియోగించి ఈ దందాకు పాల్పడుతున్న వ్యక్తి మైసూరు జిల్లా టీ.నరసిపురకు చెందిన మహేశ్‌.  

ఇన్‌స్టా ద్వారా వేధింపుల పర్వం  
ఒక యువతి ఫిర్యాదుతో ఇతని బాగోతం బయటపడింది. ఆ యువతి ఇన్‌స్టా అకౌంట్‌కు మహేశ్‌ నుంచి మెసేజ్‌ రాగా, ఎవరో అపరిచితుడు అని బ్లాక్‌ చేసింది. మళ్లీ వేరే ఇన్‌స్టా ఖాతా నుంచి మెసేజ్‌లు చేసి, తనతో చనువుగా చాట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే మీ నగ్న వీడియో తన వద్ద ఉందని బెదిరించాడు. ఆమె పట్టించుకోలేదు.

దీంతో దుండగుడు నిజంగానే ఒక వీడియోను ఆమెకు పంపాడు. అది చూసి బాధితురాలు భయభ్రాంతురాలైంది. ఎందుకంటే ఆ వీడియో ఆమె ప్రైవేటు రూమ్‌లో చిత్రీకరించినట్లు తెలుసుకుని ఈశాన్య విభాగ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఈఎన్‌ పోలీసులు తీవ్రంగా గాలించి మైసూరులో మహేశ్‌ ను శనివారం అరెస్ట్‌ చేశారు. ఇతడి వద్ద నుంచి స్పై కెమెరా, ల్యాప్‌టాప్, రెండు మెమొరీ కార్డులు, పెన్‌ డ్రైవ్, రెండు సెల్‌పోన్లను స్వాదీనం చేసుకున్నారు. 

ఎలా చేశాడంటే..  
నిందితుడు మహేశ్, ఫిర్యాదురాలికి పరిచయస్తుడు కాగా ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె రూమ్‌లో మొబైల్‌ చార్జర్‌ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చాడు. ఇంకా ఎన్ని చోట్ల ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనేదానిపై విచారణ ప్రారంభించారు.  ఈశాన్య విభాగం డీసీపీ అనూప్‌ ఏ.శెట్టి, సీఐ సంతోష్‌ రామ్‌ ఈ కేసును దర్యాప్తు చేశారు.

(చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్‌ పట్టివేత )

మరిన్ని వార్తలు