యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

25 Dec, 2022 09:01 IST|Sakshi

మన్ననూర్‌: గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ చెంచు యువకుడు హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని మాచారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాచారానికి చెందిన దాసరి లింగస్వామి (24) అచ్చంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాడు. లింగస్వామి అచ్చంపేట నుంచి స్వగ్రామం మాచారం కాలనీకి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చి ఇంటి ముందు బైక్‌ నిలిపే క్రమంలో అకస్మాత్తుగా కొందరు దుండగులు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా లింగస్వామిని పొడిచారు.

ఈ ఘటనలో అతనిపై 34 కత్తిపోట్లు పడగా.. గుండెపై 3 అంగుళాల మేరకు గాయం కావడంతో లింగస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అమ్రాబాద్‌ సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ వీరబాబు పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసు జాగిలాన్ని రప్పించగా.. హత్య జరిగిన ప్రదేశం నుంచి అమ్రాబాద్‌ వైపు రోడ్డు మార్గంలో కొంతదూరం వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని అమ్రాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి తల్లి, నలుగురు అక్కలు ఉన్నారు. లింగస్వామి హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

ప్రేమ వ్యవహారమే కారణమా..? 
లింగస్వామి హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనికి గతంలో ఓ యువతితో పెళ్లి కుదిరింది. అయితే ఇదివరకే మరో వ్యక్తితో నిశ్చితార్థం అయిన అమ్రాబాద్‌ మండలానికి చెందిన ఓ యువతితో లింగస్వామి కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో యువతితో నిశ్చితార్థం జరిగిన యువకుడు, లింగస్వామి గతంలో ఒకసారి సెల్‌ఫోన్‌లో వాదులాడుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ఎవరితో శత్రుత్వం లేదని, ఈ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..

మరిన్ని వార్తలు