సంతానం కలగడం లేదని.. భార్యపై పెట్రోల్‌ పోసి!

23 Mar, 2021 21:52 IST|Sakshi

సాక్షి, నల్గొండ : సంతాన భాగ్యం కలగడం లేదని ఓ భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ఆదమరచి నిద్దరోతున్న భార్యపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి మట్టుబెట్టాడు. ఈ దారుణ ఘటన జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు అక్కలాయిగూడేనికి చెందిన పరశురామ్‌ మున్సిపాలిటీలో జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14ఏళ్ల క్రితం వివా హం జరిగింది. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఆదివారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి పూటుగా మద్యం తాగిన పరశురామ్‌ తెల్లవారుజామున నిద్దరోతున్న భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. పరశురామ్‌ ఇంటినుంచి పొగ వస్తుండడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ సీఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకునేలోపే జ్యోతి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

చదవండి: 
నోయిడాలో ఉద్యోగం.. స్వగ్రామానికి వచ్చి లాడ్జిలో..

వివాహేతర సంబంధం: మెడ నొక్కి.. పెట్రోల్‌ పోసి!

మరిన్ని వార్తలు