మాట వినడం లేదని.. రాత్రి నిద్రపోతుంటే వచ్చి గొంతు నులిమి..

23 Jan, 2022 07:48 IST|Sakshi

సాక్షి,మిర్యాలగూడ అర్బన్‌: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య గొంతు నులిమి కడతేర్చాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న గూడపూరి దీపక్, స్రవంతికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు సంతానం. దీపక్‌ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్నేళ్లుగా దంపతులకు మనస్పర్థల కారణంగా గొడవలు జరుగుతున్నాయి. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీంతో స్రవంతి కుమారుడితో కలిసి మిర్యాలగూడలో, దీపక్‌ తల్లితో కలిసి నకిరేకల్‌లో ఉంటున్నారు. 

మాట వినడం లేదని.. 
తన మాట వినడం లేదని దీపక్‌ భార్యపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిర్యాలగూడలోని స్రవంతి ఉంటున్న ఇంటికి వచ్చాడు. పథకం ప్రకారం స్రవంతి గొంతు నులమడంతో అక్కడికక్కడే మృతిచెందింది. శ్రవంతి చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం దీపక్‌  నేరుగా వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌రావు ఎస్‌ఐ అంతిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు