బోర్వెల్ వ్యాపారి ఇంట్లో చోరీ కేసు
నిందితుల్లో ముగ్గురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న బోర్వెల్ వ్యాపారి గూడూరు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఆహారంలో మత్తు మందు కలిపి..యజమానులు స్పృహ కోల్పోయాక పనిమనుషులు దోపిడీకి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో పాల్గొన్న వారంతా నేపాల్ నుంచి పనుల కోసం ఇక్కడికి వచ్చినవారుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేశారు.
సూత్రధారి నేత్రా
మూడు వాహనాలు మార్చి... నేపాల్కు పారిపోతూ ..
మధుసూదన్రెడ్డి ఇంట్లో దోపిడీ చేసిన వెంటనే నేపాలీ వాసులు రాజేందర్, (డ్రైవర్), దేవీరామ్ దమ్లా, జానకి, వినోద్ కమల్ షాహీ, భోజల్ బీక, మనోజ్ బహదూర్ సాహీ రెండు బృందాలుగా విడిపోయి ఢిల్లీ, ముంబై వైపు చెరి కొంత సొత్తు తీసుకొని పారిపోయారు. అయితే నేత్రతో పాటు ప్రకాష్ శషి అలియాస్ ప్రతాప్, సిటలావర్లు మరో బృందంగా ఏర్పడి మరికొంత సొత్తు, నగదుతో అద్దె వాహనంలో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి నాందేడ్, ఇండోర్, లక్నో, లఖీమ్పూర ప్రాంతం మీదుగా నేపాల్కు వెళ్లాలనుకున్నారు. గతంలోనూ వీరు ఇలానే నేపాల్కు వెళ్లి అక్కడ సొత్తును, డబ్బులు పంచుకొని ఎవరి ఊళ్లకు వారు వెళ్లేవారు.
అయితే ఈ దోపిడీని సీరియస్గా తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పది బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ పోలీసులతో పాటు ఎస్ఎస్బీ అధికారులతో మాట్లాడారు. అప్పటికే యూపీ–నేపాల్ సరిహద్దుగా ఉన్న లఖీమ్పూర్కు నేత్రా బృందం చేరుకోగానే అక్కడే మాటువేసి ఉన్న సైబరాబాద్ పోలీసుల బృందం అక్కడి పోలీసుల సహకారంతో పట్టుకుంది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం కూడా ఇతర బృందాలు గాలిస్తున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన రాయదుర్గం ఇన్స్పెక్టర్ రవీందర్, మాదాపూర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధీర్, నార్సింగి డీఐ బాలరాజులను సీపీ సజ్జనార్ రివార్డులతో
సన్మానించారు.
‘లేక్ గార్డెన్స్’ మోసగాళ్లు
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని లేక్ గార్డెన్స్ ప్రాంతం నకిలీ కాల్ సెంటర్లకు అడ్డాగా మారింది. ఫ్రెండ్షిప్ క్లబ్స్ పేరుతో ఇక్కడ ఏర్పాటవుతున్న కాల్ సెంటర్ల ద్వారా మోసగాళ్లు దేశ వ్యాప్తంగా అనేక మందిని టార్గెట్ చేస్తున్నారు. వీరి చేతిలో మోసపోతున్న బాధితుల్లో దక్షిణాదికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ ప్రాంతంపై దాడి చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు సూత్రధారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
మందలించినందుకు ఘాతుకం
చైతన్యపురి: పని చేయడం లేదని మందలించినందుకు ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా, చిట్యాల గ్రామానికి చెందిన ఏదూరి వెంకన్న, సుభద్ర దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చారు. వెంకన్న కారు డ్రైవర్గా పని చేసేవాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆరేళ్లుగా వారిరువురు విడివిడిగా ఉంటున్నారు. సుభద్ర పీఅండ్టీ కాలనీలోని అనంతలక్ష్మి ఆపార్టుమెంట్లో వాచ్మన్గా పనిచేస్తూ పిల్లలతో కలిసి ఉంటుంది. నెలరోజుల క్రితం పెద్దమనుషులు పంచాయితీ చేసి నచ్చజెప్పడంతో వెంకన్న భార్యా పిల్లల వద్దకు వచ్చాడు.
వెంకన్న ఏపని చేయకుండా ఖాళీగా ఉండటంతో శనివారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. పిల్లలు బయట పడుకోగా వెంకన్న, సుభద్ర గదిలో నిద్రించారు. భార్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న వెంకన్న పార్కింగ్లో ఉన్న బైక్ల నుంచి బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చి నిద్రిస్తున్న సుభద్రపై పోసి నిప్పంటించాడు. నిద్రనుంచి మేల్కొన్న సుభద్ర మంటలతోనే భర్తను పట్టుకుంది. అతను ఆమెను తోసేసి బయట గడియ పెట్టి అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సుభద్రను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు మహేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితుడు వెంకన్నను సోమవారం ఉదయం ఎల్బీనగర్లో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
యువతి బలవన్మరణం
ముషీరాబాద్: మూడుసార్లు చార్టెడ్ అకౌంట్ పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సామ్యానాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ లక్ష్మమ్మ పార్కు ప్రాంతానికి చెందిన ఉత్తమ్చంద్ జైన్ కుమార్తె స్వప్న జైన్ (24) చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలకు సిద్ధమవుతోంది. కుటుంబ సభ్యులు మొదటి అంతస్తులో ఉంటుండగా, స్వప్న రెండో అంతస్తులోని తన గదిలో పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం మధ్యాహ్నమైనా గదిలోనుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఉత్తమ్చంద్ జైన్ తలుపులు బద్దలు కొట్టిచూడగా ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వప్న జైన్ మూడుసార్లు సీఏ పరీక్షలు మూడుసార్లు రాసినా క్వాలిఫై కాకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గచ్చిబౌలిలో అంతర్రాష్ట్ర బెట్టింగ్ గ్యాంగ్!
సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వ్యవస్థీకృతంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) రట్టు చేసింది. ఆదివారం రాత్రి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రలతో పాటు నగరంలో గచ్చిబౌలి ప్రాంతంలోనూ సదరు అధికారులు దాడులు నిర్వహించారు. ముంబైలో మకాం వేసిన బుకీలు పారిపోగా, మిగిలిన చోట్ల 14 మందిని అరెస్టు చేసిన ఏటీఎస్ రూ.16 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. గచ్చిబౌలిలో జరిగిన దాడిలో కన్నయ్య లాల్, చలానీ, చంపాలాల్, కిషోర్, భానులను అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ ఆన్లైన్ ద్వారానూ ఆర్థిక లావాదేవీలకు పాల్పడటంతో ఆ మొత్తం ఎంత అనేది ఆరా తీస్తున్నారు. వీరు బెట్టింగ్ నిర్వహణకు అత్యాధునిక పరిజ్ఞానం వాడుతున్నట్లు తేలింది.